Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువత ఓట్లే కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేలా వారి ఓట్లు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంది 9,45,094 ఓటర్లు ఉండగా అందులో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వారు అత్యధికంగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,75,746 మంది యువ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో వెల్లడించింది.
ఎన్నికల సమయం దగ్గరకు రావడంతో అభ్యర్థుల చూపంతా అధికంగా ఉన్న మధ్య వయస్కుల వారి ఓట్లపైనే పడింది. జిల్లాలో యువత ఓట్లే అత్యధికంగా ఉండడంతో వారిని ఆకర్షించడానికి ఆయా పార్టీల అభ్యర్థులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే యువత మాత్రం అభివృద్ధి చేసిన పార్టీల వైపే మొగ్గు చూపుతోంది. తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధిని, అంతకు ముందు ఉన్న దుర్భర స్థితిని యువ ఓటర్లు గమనిస్తు న్నారు.
జనరల్ స్థానమైన కొత్తగూడెం నియోజకవర్గంలో యువత ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. మొత్తం ఓటర్లు 2,36,903 మంది కాగా, అందులో యువ ఓటర్లే 1,17,058 మంది ఉన్నారు. అంటే మొత్తం నియోజకవర్గ ఓటర్లలో సగభాగం యువతీ యువకులు, మధ్య వయస్కులే. ఉద్యోగ, ఉపాధి అవకాశాల వంటివి వీరిని ప్రభావితం చేయనున్నాయి.
ఒక ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యేనే కారణం. అందుకే యువతీ యువకులు ఓట్లు వేయాలంటే ముందు చూసేది అతడు అభివృద్ధి చేయగలడా? లేదా? అని. అంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేసి ఉంటే యువతీ యువకులు కూడా మళ్లీ వారినే ఎన్నుకుంటారు.
తెలంగాణ వచ్చాకే అన్ని ప్రాంతాల్లో సమ్రగ అభివృద్ధి జరిగింది. అంతకుముందు ఈ ప్రాంతంలో అభివృద్ధి అనే మాటే లేదు. యువత కూడా తమ ప్రాంత అభివృద్ధిని, వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను చూస్తుంది. వీటిని ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వాలను, తమ అభివృద్ధికి బాటలు వేసే అభ్యర్థులను మాత్రమే యువతీ యువకులు ఆదరిస్తారు.
యువత, మధ్య వయస్కుల్లో అత్యధికులు చదువుకున్న వారే ఉన్నారు. ఓటు వేసేటప్పుడు వీరు తప్పకుండా అభివృద్ధి గురించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ఆలోచిస్తారు. అభివృద్ధి చేసిన, ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వాల వెంటే ఉంటారు. స్వయం ఉపాధి కల్పించిన వారినే ఆదరిస్తారు.
ఓటు హక్కు చాలా విలువైనది. దానిని యువ ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఐదేళ్లపాటు మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే అందుకు తగిన అభ్యర్థినే ఎన్నుకోవాలి. చదువుకున్న వాళ్లెప్పుడూ మాయమాటలు నమ్మరు. చేసిన అభివృద్ధిని, చేయాల్సిన పనులను చూస్తారు. యువతీ యువకులు ఎప్పుడూ తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసే ప్రభుత్వాలనే కోరుకుంటారు.