మళ్లీ పెరిగిన గెలల ధర రూ.19,114
జూన్ నెలకు రూ.730 పెంపు
అమితానందంలో అన్నదాతలు
అశ్వారావుపేట, జూన్ 2 : ఆయిల్ఫెడ్ సంస్థ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ఆయిల్పాం రైతులకు సంస్థ అందించే టన్ను గెలల ధరను జూన్ నెలకు భారీగా పెంచింది. దేశంలోనేతెలంగాణ ఆయిల్ఫెడ్ ఆల్టైం రికార్డు సృష్టించింది. నాలుగేళ్లుగా గెలల క్రష్షింగ్ ద్వారా నాణ్యమైన ఆయిల్ రికవరీని సాధిస్తున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఆయిల్పాం రైతులకు గెలల ధరను భారీగా అందిస్తున్నారు. దీంతో రైతులు అమితానందంలో ఉన్నారు.
కొంత కాలంగా ఆయిల్పాం రైతులకు పామాయిల్ గెలల ధరను ప్రకటించడంలో ఆయిల్ఫెడ్ అధికారులు ప్రణాళిక ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నారు. ఆయిల్ రికవరీ ఆధారంగా ప్రతి నెల ధరను భారీగా ప్రకటిస్తున్నారు. ఇతర రాష్ర్టాల కంటే రైతులకు టీఎస్ ఆయిల్ఫెడ్ అత్యధిక ధరను చెల్లిస్తుంది. గతనెలతో పోల్చితే జూన్ నెలలో టన్నుకు రూ.730 ఎక్కువగా ప్రకటించింది. గత నెల మేలో టన్ను గెలల ధర రూ.18,384లు చెల్లించింది. ఈ ఏడాది జనవరి నుంచి గెలల ధరను భారీగా ప్రకటిస్తున్నది. జనవరిలో టన్ను ధర రూ.14,415 ఉండగా.. ఫిబ్రవరి నెలలో రూ.15,147కు పెంచారు. మార్చిలో ఆ ధర రూ.15,923కు చేరింది. ఏప్రిల్లో ఏకంగా టన్ను ధర రూ.17,264కు ఎగబాకింది. మేలో టన్నుకు రూ.1,020 పెరిగి రూ.18,384కు అందించారు. జూన్లో అధికారులు ధరను మరింత పెంచి రూ.19,114లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో సమావేశమైన ఆయిల్ఫెడ్ అధికారులు కొత్త ధరపై నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్పాం సాగు ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. పెరిగిన సాగు పెట్టుబడి దృష్ట్యా రైతులు కూడా కనీసం టన్ను గెలలు ధర రూ.15 వేలకు తగ్గకుండా ఉంటే చాలని భావించారు. కానీ రైతులు ఆశించిన ధర కంటే భారీగానే ఆయిల్ఫెడ్ చెల్లిస్తున్నది. గెలల ధర భారీగా పెరుగుతుండడంతో ఇతర వర్గాల రైతులు ఆయిల్పాం సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
దళారీ వ్యవస్థ లేకుండానే సంస్థ అధికారులు ఆయిల్పాం దిగుబడులను దిగుమతి చేసుకుంటూ రవాణా చార్జీలను రైతులకు చెల్లిస్తున్నది. పచ్చని తెలంగాణకు దోహదపడే ఆయిల్పాం సాగు విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గెలల ధర భారీగా ఉండడంతో సాగు విస్తరణ వేగవంతమవుతుందని ఆయిల్ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు. సాగు విస్తరణ లక్ష్యం పూర్తి అయితే త్వరలోనే తెలంగాణ రాష్ట్రం ఆయిల్పాం హబ్గా రూపుదిద్దుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన జిల్లాల్లో ఆయిల్పాం సాగు విస్తరణ స్పీడ్ అందుకున్నది. మొక్కల కోసం ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేశారు. ఆయిల్పాం సాగును రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా ప్రోత్సహిస్తున్నది. సాగు విస్తరణ బాధ్యతలను టీఎస్ ఆయిల్ఫెడ్తోపాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. టన్ను గెలల ధర రూ.20 వేలకు చేరువలో ఉండడంతో రైతులు సీఎం కేసీఆర్, సంస్థ అధికారులను రైతులు అభినందిస్తున్నారు.
ఆయిల్పాం రైతుల అభివృద్ధికి ప్రాధాన్యం
ఆయిల్పాం సాగు చేస్తున్న రైతుల అభివృద్ధికి టీఎస్ ఆయిల్ఫెడ్ అధిక ప్రాధాన్యమిస్తుంది. మెరుగైన ధర అందించేందుకు ఆయిల్ రికవరీపై దృష్టి సారించాం. దీనికి అనుగుణంగా గెలల ధరను నిర్ణయిస్తాం. రైతులు ఆశించిన ధర కంటే ఎక్కువగానే అందిస్తున్నాం. దీర్ఘకాలిక ఆదాయానిచ్చే ఆయిల్పాం సాగు విస్తరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సాగు విస్తరణ బాధ్యతను టీఎస్ ఆయిల్ఫెడ్తోపాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలు పనులు వేగవంతం చేస్తున్నాయి. జూన్లో ప్రకటించిన టన్ను గెలల ధర రూ.19,114 ఆయిల్ఫెడ్ చరిత్రలోనే ఆల్టైం రికార్డ్. గతేడాది డిసెంబర్ నుంచి రైతులకు మేలైన ధర చెల్లిస్తున్నాం. గెలల సేకరణలో రైతులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుం టే ఆయిల్ రికవరీ పెంచుకోవడంతోపాటు మరింత గిట్టుబాటు ధర పొందే అవకాశాలు ఉన్నాయి.