ఖమ్మం, ఏప్రిల్ 23 : స్వేచ్ఛ, న్యాయబద్ధంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం ఎన్నికల సమన్వయం కోసం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఏలూరు జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, ఎస్పీలతో జూమ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. చెక్పోస్టుల ద్వారా 24గంటలు క్రియాశీలకంగా నిఘా ఉంచాలన్నారు. సమాచారం పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో 12 మిర్రర్ చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.
డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. పీఆర్, ఆర్అండ్బీ రహదారులు 60 ఉన్నట్లు, చెక్పోస్టులు లేనిచోట స్థానిక పోలీస్, ఫ్లయింగ్ స్వాడ్ నిఘా బృందాలు తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఓటు వేసేప్పుడు ఇండిబుల్ ఇంక్ వెంటనే తుడుచుకోనీయకుండా పోలింగ్ కేంద్రంలో చర్యలు తీసుకుంటే తిరిగి ఓటు వేసేందుకు ఆసారం ఉండదన్నారు. ఓటర్స్లిప్పుల పంపిణీ ఈ నెల 25వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి మురళీధర్రావు, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి, సీపీవో ఏ. శ్రీనివాస్, ఆర్టీవో ఆఫ్రీన్, కలెక్టరేట్ ఏవో అరుణ, జీఎస్టీ, ఐటీ అధికారులు పాల్గొన్నారు.