అశ్వారావుపేట టౌన్, మే 13: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ వసతుల ఏర్పాటు పనులకు పూర్తి బాధ్యత సంబంధిత గ్రామ సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్/చైర్పర్సన్, ప్రధానోపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. ఈ పనులను కాంట్రాక్టుకు ఇచ్చేది లేదన్నారు. ఆయన శుక్రవారం పట్టణంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ఉర్దూ ఎంపీపీఎస్ తదితర పాఠశాలలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మన బడి’ కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో మరమ్మతు, వసతుల ఏర్పాటు పనులు ప్రారంభమైనట్లు చెప్పారు.
ఈ పనులన్నీ కచ్చితంగా రెండు నెలల్లో (ఆగస్టు నాటికి) పూర్తి చేయాల్సిందేనని చెప్పారు. మరుగుదొడ్లు, అదనపు గదులు, విద్యుత్, డిజిటల్ తరగతులు, వెంటిలేషన్, తాగునీరు తదితర పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఇరిగేషన్, ట్రైబల్ వెల్ఫేర్, పీఆర్ ఇంజినీర్లకు అప్పగించినట్లు చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొత్తం 86 పాఠశాలలను ‘మన బడి’ కింద ఎంపిక చేసినట్లు చెప్పారు. వచ్చే మూడేండ్లలో అన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులను కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆయన వెంట పీఆర్ ఏఈ కృష్ణ, ఆర్ఐ అనిల్ కుమార్, హెచ్ఎంలు రాంబాబు, అమృతకుమారి తదితరులు ఉన్నారు.