ఖమ్మం, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రఘునాథపాలెం మండలంలో నిర్మించిన పోలీస్స్టేషన్, తహసీల్ కార్యాలయాల నూతన భవనాలను మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కోసం సఖి భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మంత్రి అజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ర్టానికి ఒరిగిందేమీలేదని విమర్శించారు. –
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధితో ‘తెలంగాణ’ యావత్ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం, జైళ్ల అభివృద్ధి శాఖల మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రఘునాథపాలెం మండలంలో నిర్మించిన పోలీస్స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల నూతన భవనాలను రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి హోం మంత్రి మాట్లాడారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించిన తెలంగాణలో ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఎంతో ముందుచూపుతో ప్రణాళికలు తెచ్చి తెలంగాణను దేశంలోనే నం.1 స్థానంలో నిలిపారన్నారు.
తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని ఉద్యమ సమయంలో ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేశాయని.. సీఎం కేసీఆర్ వారి మాటలను తిప్పికొట్టేలా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిస్తున్నారన్నారు. రెవెన్యూ వ్యవస్థతో రాష్ట్ర రైతాంగం పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ‘ధరణి’కి రూపకల్పన చేశారని, దీనివల్ల రైతులకు ఎంతో ఉపయోగం జరిగిందన్నారు. ధరణిపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, విపక్షాల తొర్రికూతలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీస్ వ్యవస్థలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. షీ టీమ్ ద్వారా సఖి భరోసా కేంద్రాలను నెలకొల్పి మహిళలకు రక్షణ కల్పించారన్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు. మంత్రి అజయ్కుమార్ ఖమ్మాన్ని సమగ్రాభివృద్ధి చేశారన్నారు. ఒకప్పటి ఖమ్మానికి.. ఇప్పటి ఖమ్మానికి నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తున్నదన్నారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ను ఆదరించాల్సిన అవసరం ఉన్నదని ప్రజలకు సూచించారు.
48లక్షల మంది వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు
ఆసరా పథకం ద్వారా ప్రతి నెలా ఠంఛన్గా పింఛన్ డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి వికలాంగుల పింఛన్ రూ.4,116 చేస్తున్నట్లు సీఎం ప్రకటించారని, ఏ రాష్ట్రంలోనైనా ఇంత పెద్ద మొత్తంలో పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయా? అని ఆయన అడిగారు. 47 ఏళ్లు కాంగ్రెస్, 18 ఏళ్లు టీడీపీ రాష్ర్టాన్ని పాలించి తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేశాయన్నారు. అనతికాలంలోనే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్కే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు.
‘ధరణి’ పోతే గోస పడ్తరు..;రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
తెలంగాణ సర్కార్ ‘ధరణి’ ద్వారా రైతులకు సులభతరమైన సేవలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కేవలం ఐదు నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగే విధానం దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. ధరణిపై విపక్షాలు పిచ్చిప్రేలాపనలు చేస్తున్నాయని, మరోమారు రెవెన్యూ వ్యవస్థ బ్రోకర్ల చేతుల్లో కీలుబొమ్మ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ ఒక పరిపూర్ణమైన రూపాన్ని అందించారని, తొమ్మిదేళ్లలోనే స్వర్ణయుగాన్ని మన కళ్లముందు సాక్షాత్కరింపజేశారని పేర్కొన్నారు. తాను మంత్రిగా నాలుగేళ్లలోనే వందల కోట్ల నిధులు తీసుకొచ్చి ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దానన్నారు. నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం ఒకప్పుడు ఖమ్మం అర్బన్లో భాగంగా ఉండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదన్నారు. ఎక్కువగా గిరిజనులు నివసించే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రఘునాథపాలెం పేరుతో జిల్లాలోనే ఏకైక కొత్త మండలాన్ని తెచ్చుకున్నామన్నారు. మంత్రిగా మండలాభివృద్ధికి రూ.254కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మండలాల్లో కేవలం రఘునాథపాలెంలోనే తహసీల్దార్, పోలీస్స్టేషన్, మండల పరిషత్ కార్యాలయాలు నిర్మించుకున్నామన్నారు. రఘునాథపాలెం ఠాణాను ఖమ్మం నగరానికి ఎటాచ్మెంట్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ.. హోం మంత్రి మహమూద్ అలీని కోరారు. దీనిపై స్పందించిన ఆయన త్వరలోనే జీవో జారీ చేస్తానని హామీ ఇచ్చారు.
పరిపాలనాదక్షుడు కేసీఆర్ ;వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
ఎంతో ముందుచూపుతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, ఆయన పరిపాలనాదక్షుడని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తొమ్మిదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో దశాబ్ది ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనను సుస్థిరం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ధరణి ద్వారా రైతుల భూములకు భద్రత లభించిందన్నారు. ఇది ప్రతిపక్షాలకు తెలిసినా అధికారం దక్కించుకోవాలనే కుటిలబుద్దితో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి ద్వారా మీ భూములు భద్రంగా లేవా? రైతుబంధు అందుకోవడం లేదా? కేసీఆర్ సర్కారు తెచ్చిన పథకాలు తీసుకోవడం లేదా? అని కాంగ్రెస్, బీజేపీలను ఆయన ప్రశ్నించారు. మీరు పాలించే రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.
రేవంత్, భట్టిలను హుస్సేన్సాగర్లో ;నిమజ్జనం చేయాలి : ఎమ్మెల్సీ తాతా మధు
ధరణి గొప్పతనం గురించి తెలియని దగుల్భాజీలు, అజ్ఞానులు పిచ్చికూతలు కూస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్కలపై ఎమ్మెల్సీ మధుసూదన్ మండిపడ్డారు. రైతులకు న్యాయం చేయడానికి తీసుకొచ్చిన ధరణిపై మాట్లాడిన రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్కలను హైదరాబాద్ హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు అడిగితే రైతులను పిట్టలను కాల్చినట్లు కాల్చారని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పంట పెట్టుబడి కోసం రైతులు రూ.5 చొప్పున వడ్డీకి తెచ్చుకొని అవి కట్టలేక ఆత్మహత్యలే శరణ్యంగా భావించేవారన్నారు. కానీ.. నేడు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయంగా ప్రతి రైతుకు ఎకరానికి రూ.10వేలు అందిస్తూ అప్పులు చేయాల్సిన అవసరమే లేకుండా చేశారన్నారు. అభివృద్ధి చేస్తున్న నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మండల ప్రజలపై ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల క్రితం ఇళ్ల పట్టాలు పొంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోలీస్ అమరవీరుల కుటుంబాలకు హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మరోమారు పట్టాలను అందించి భరోసాగా నిలిచారు. సభకు జడ్పీటీసీ మాలోతు ప్రియాంక అధ్యక్షత వహించగా సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఎంపీపీ గౌరి, వైస్ ఎంపీపీ రవి, నాయకులు వెంకటరమణ, కుర్రా భాస్కర్రావు, అజ్మీరా వీరూనాయక్, గుడిపూడి శారద, మందడపు నర్సింహారావు, మందడపు సుధాకర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.