పెద్దపల్లి/పెద్దపల్లి టౌన్, జనవరి 3: తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే ఆదర్శమూర్తి అని, నిమ్నజాతి వర్గాలకు చదువు నేర్పించడం కోసం ఎనలేని కృషి చేశారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కొనియాడారు. ఆమెను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆమె సేవలను నేటి తరానికి వివరించాలని పిలుపునిచ్చారు. సావిత్రీబాయి జయంతిని పురస్కరించుకొని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని అమర్ చంద్ కల్యాణ మండపంలో కాళేశ్వరం జోన్లో ఉత్తమ సేవలందించిన 300 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు బుధవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పుట్ట మధు ముఖ్య అతిథిగా హాజరై, మహిళా ఉద్యోగులను సన్మానించారు. ప్రశంస పత్రాలు అందజేశారు. ఒకే వేదికపై వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులను సత్కరించడంపై నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నతనియల్, ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు రాలు జ్యోతి, జిల్లా అధ్యక్షుడు లింగమల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, ఈర్ల శోభరాణి, నాయకులు పోగుల వెంటేశం, క్యాదాసి రాజేశం, బొంకూరి ప్రవీణ్, దుబాసి బొందయ్య, శివధర్, నర్సయ్య, లక్ష్మణ్, కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.