ఉమ్మడి జిల్లాపై కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకూ పాతాళానికి చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో నెల వ్యవధిలోనే సగటున 1.23 మీటర్ల లోతుకు పడిపోయాయి. దాదాపు అంతటా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరుటిదాకా మండు వేసవిలో సైతం నిండుకుండల్లా మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ప్రాజెక్టులు సైతం అడుగంటుతున్నాయి. వ్యవసాయ బావులు, బోర్లు వట్టిపోతున్నాయి. తాగునీటికి సైతం కష్టాలు మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాసంగి పంటలు చేతికి వచ్చే సమయంలో ఎండిపోతుండగా, రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీరిచ్చి పంటలను కాపాడాలని వేడుకుంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు.
కరీంనగర్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో ఎటు చూసినా జలాలు పరుగులు తీశాయి. నిరుడు నిండువేసవిలో కూడా చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకాయి. ప్రాజెక్టు కాలువల ద్వారా పుష్కలంగా నీళ్లు అందాయి. తద్వారా భూగర్భ జలాలు పడిపోకుండా స్థిరంగా ఉన్నాయి. బావులు, బోర్లపైన కూడా ఆధారపడి సాగు చేయగా, బంగారు పంటలు పండాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కరువు ఛాయలు కనిపిస్తున్నాయి.
రోజురోజుకూ భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. పోయినేడు మేలో 7.37 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఈ యేడాది ఫిబ్రవరిలోనే దుర్భర స్థితి ఎదురైంది. భూగర్భ జలశాఖ అధికారుల నివేదిక ప్రకారం.. గత నెలలో 7.57 మీటర్ల లోతుకు పడిపోయాయి. దీన్ని చూస్తే ఈసారి పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్యలో కూడా భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. జనవరిలో సగటున 6.34 మీటర్లు ఉన్న భూగర్భ జలం ఫిబ్రవరిలో 7.57 మీటర్లకు పడిపోయింది.
అంటే నెల వ్యవధిలో సగటున 1.23 మీటర్లకు తగ్గిపోయింది. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అడుగంటి పోతున్నాయి. ఎస్సారెస్పీ, ఎల్ఎండీలో నీటిమట్టం పూర్తిగా పడిపోతున్నది. ఎల్ఎండీలో 5.101 టీఎంసీ మాత్రమే నీరున్నది. మధ్య మానేరు ద్వారా నీటిని విడుదల చేస్తున్నా.. ఈ జలాశయంలో కూడా ఆశించిన నీరు లేదు. ఈ పరిస్థితుల్లో సాగునీటి కోసం తండ్లాడాల్సి వస్తున్నది. ప్రధానంగా మెట్ట ప్రాంతంలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. నాడు పచ్చగా కనిపించిన భూములు నేడు నెర్రెలు వారుతున్నాయి. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి.
పదేళ్లుగా ఏ రందీ లేకుండా సంబురంగా సాగు చేసిన రైతులు, ఈ యాసంగిలో ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు నీళ్లిస్తామని చెప్పినా.. ఇప్పుడు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కాలువల ద్వారా నీళ్లు రాక భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. అయితే భూగర్భ జలాలు వేగంగా పాతాళానికి పడిపోతుండగా.. పంటలను కాపాడుకునేందుకు అరిగోస పడుతున్నారు. కొందరు ట్యాంకర్లు, ఇతర ప్రాంతాలను నీటిని తెచ్చేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
వ్యవసాయ బావుల్లో పూటిక తీయిస్తున్నారు. మరికొందరు ఎండుతున్న పంటలను చూసి కన్నీరు పెడుతున్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో నీటికి కటకట ఏర్పడడంతో గుండె మండి రోడ్డెక్కుతున్నారు. కాలువల ద్వారా సాగు ఇవ్వాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. మార్చిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరో నెల రోజులు ఎలా గట్టెక్కేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండి పోయాయని, పెట్టిన పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.