హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : బీసీ సామాజిక న్యాయపోరాట సభ వచ్చేనెల 9న నల్లగొండ జిల్లాలో నిర్వహించనున్నామని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ (బీసీఐఎఫ్) అధ్యక్షుడు చిరంజీవులు వెల్లడించారు. భావజాల ప్రచారం నుంచి ప్రజా ఉద్యమాల దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ రెండవ వార్షికోత్సవ సమావేశాన్ని హైదరాబాద్ కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీఐఎఫ్ జెండా, కండువా, లోగోలను ఆవిషరించారు. సంస్థ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
అనంతరం చిరంజీవులు మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించి బీసీఐఎఫ్ భావజాలాన్ని గ్రామస్థాయికి విస్తరింపజేసి యువతను ఉద్యమంలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. బీసీఐఎఫ్ను భవిష్యత్లో రాజకీయ పార్టీగా మార్పు చేసే అంశాన్ని తాతాలికంగా వాయిదా వేశామని వెల్లడించారు. ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హకుల పరిరక్షణ కోసం ప్రత్యక్ష ఉద్యమాలు చేపడతామని తెలిపారు. సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వీరస్వామి, వైస్చైర్మన్ బెనర్జీ, సభ్యులు సూరగోని రమేశ్, కూరపాటి రమేశ్, చంద్రశేఖర్, ఇప్పనపల్లి సాంబయ్య, శ్రీకాంత్, లింగేశ్ యాదవ్, వివిధ సంఘాల నాయకులు, ఫోరం రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.