అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి తమకు ఏ పార్టీ సాటి లేదని నిరూపించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, అదే ఊపుతో ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టబోతున్నారు. తనకు రెండు సార్లు కలిసొచ్చిన హుస్నాబాద్ గడ్డ నుంచే మరోసారి శంఖారావం పూరించబోతున్నారు. ఈ నెల 15 నుంచి ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుడుతున్న ఆయన, వచ్చే నెల 7లోపు పూర్వపు కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ సహా ఆరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
అధినేత సభలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ జిల్లా శ్రేణులు ఇప్పటికే రంగంలోకి దిగాయి. సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ, భారీగా జన సమీకరణ చేసేందుకు దిశానిర్దేశం చేస్తున్నాయి. మరోవైపు గులాబీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తుండగా, ప్రతిపక్ష పార్టీలు కలవర పడుతున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు కాకపోవడం, సీటు కోసం పదే పదే ఢిల్లీకి వెళ్లడం, టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు రావడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అసహనంలో మునిగిపోయాయి.
– కరీంనగర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. అభివృద్ధే అస్ర్తాలుగా ఎన్నికల సమరాంగణంలోకి అడుగు పెట్టబోతున్నారు. తనకు కలిసొచ్చిన పూర్వపు కరీంనగర్ జిల్లా నుంచే మూడోసారి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ వేదికగా ప్రచారం ప్రారంభించిన ఆయన, ఈ సారి కూడా ఇక్కడి నుంచే సమరభేరి మోగించబోతున్నారు. ఈ నెల 15న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్స్ అందజేసి, అదే రోజు నుంచి శంఖారావాన్ని పూరించనున్నారు. తొలి విడుతగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 9వరకు అంటే 17 రోజుల్లో 42 నియోజకవర్గాలను చుట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. కాగా, వచ్చే నెల 7లోపు పూర్వ కరీంనగర్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగసభలకు హాజరుకానున్నారు.
ఈనెల 15న హుస్నాబాద్లో తొలి బహిరంగ సభ సాయంత్రం ఐదు గంటలకు, 17న సిరిసిల్ల నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటలలోపు, వచ్చేనెల 2న ధర్మపురిలో మూడు గంటలకు, 3న కోరుట్లలో మధ్యాహ్నం 3 నుంచి నాలుగు గంటల మధ్య, 7న మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొంటారు. మిగిలిన నియోజకవర్గాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత పాల్గొనే అవకాశముందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రామగుండం, పెద్దపల్లి, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలు.. మంత్రి హరీశ్రావు కోరుట్ల, మానకొండూర్ మండలం ఇల్లంతకుంటలో బహిరంగసభలు నిర్వహించారు. ఆయాచోట్ల సభలు గ్రాండ్ సక్సెస్ కాగా, అదే ఉత్సాహంతో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఆయా నియోజకవర్గాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. భారీ జన సమీకరణ చేసేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 17న సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డులో సభ నిర్వహించనుండగా, గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్సీ రమణ ఏర్పాట్లను పరిశీలించారు.
అలాగే వార్డుల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో టీపీటీడీసీ చైర్మన్ సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణితో కలిసి వార్డుల్లో పర్యటించి, సభను విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లు దార్నం అరుణ, దార్ల కీర్తన, దిడ్డి మాధవి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి సీఎం సభకు రావాలని ఆహ్వానించారు. ఈ నెల 15న హుస్నాబాద్ సభకు రావాలని చిగురుమామిడి మండలంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఇంటింటికీ వెళ్లి కోరారు.
అన్ని పార్టీల కంటే ముందుగానే ఆగస్టు 21న బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడంతో సదరు అభ్యర్థులు నియోజకవర్గాలను చుట్టివస్తున్నారు. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా.. ప్రజలతో మమేకమవుతున్నారు. గడపగడపకూ వెళ్లి గడిచిన తొమ్మిదేళ్లలో తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఇంకా ఏమిచేస్తామో చెబుతూ ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్న పనులను సైతం ఎలా పూర్తి చేస్తారో వివరిస్తున్నారు.
వీటితో పాటు నాటి సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం, ఆనాటి కరువు పరిస్థితులు, కరెంటు దుస్థితి, జాడ లేని సంక్షే పథకాల వంటి అంశాలను కండ్లకు కట్టినట్టు వివరిస్తూ, కండ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరుతున్నారు. దీంతో ప్రజల నుంచి అనుహ్య స్పందన వస్తున్నది. ఒక్క మాటలోచెప్పాలంటే.. చాలాచోట్ల గ్రామాలకు గ్రామాలే స్వచ్ఛందంగా వచ్చి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాయి. పలు కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాయి.
ఓవైపు గులాబీ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తుండడం, మరోవైపు స్వయంగా ముఖ్యమంత్రి బహిరంగ సభల షెడ్యల్ విడుదల కావడం.. ఇంకోవైపు గ్రామాలు, కుల సంఘాలు బీఆర్ఎస్కు మద్దతు తెలుపడం.. బీజేపీ, కాంగ్రెస్ను కలవర పెడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా.. నేటికి అభ్యర్థులెవరో..? ఏ నియోజకవర్గం నుంచి ఎవరికి టికెట్ ఇస్తారో..? ఎవరూ పోటీ చేస్తారో..? తెలియని ఆయోమయ పరిస్థితి రెండు పార్టీల్లో నెలకొన్నది.
టికెట్ల కోసమే ఢిల్లీ నేతల వద్దకు పదుల సార్లు పరుగులు పెడుతుంటే.. మున్ముందు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందా..? తెలంగాణకు న్యాయం చేస్తుందా..? గతంలో పలువురు చెప్పినట్టుగా ఇక్కడి నాయకులు ఢిల్లీ నేతలకు గులాంలుగానే ఉంటారా..? మళ్లీ తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టు పెడుతారా..? అన్న అనేక సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. అంతేకాదు, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలోనూ ఇప్పటికే అసంతృప్తులు బయటపడుతుండగా, వివిధ నియోజకవర్గాల్లో టికెట్లు అమ్ముకుంటున్నారని రాష్ట్ర నాయకత్వాలపై సదరు పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. అభ్యర్థుల ఖరారుపై క్లారిటీ ఇవ్వడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని ఆ పార్టీల్లోని శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నాయి.