మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే.. ఒక్కొక్కరుగా కాకుండా సమష్టిగా శ్రమించి సత్ఫలితాలు సాధిస్తున్నారు.. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించారు.. పిండి వంటకాల తయారీకి శ్రీకారం చుట్టారు. ఎనిమిది మంది అతివలు కలిసి ఒక గ్రూపుగా ప్రారంభించిన ఈ వ్యాపారం.. రోజురోజుకూ లాభాల ఘుమఘుమలు పంచుతున్నది. మొదట కష్టంగా అనిపించినా.. రానురాను భోజన ప్రియులు మక్కువ చూపుతుండడంతో లాభాలు పెరుగుతున్నాయి. ఒక్క యేడాదిలో రూ.6 లక్షల వ్యాపారం చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.
కథలాపూర్, జూలై 5 : మహిళలు వంటింటికే పరిమితం అనే మాటను ఇక్కడి అతివలు మరిపిస్తున్నారు. వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. మరికొందరు తీరొక్క పిండి వంటకాలు తయారు చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు. వారు తయారు చేస్తున్న ఈ పిండి వంటకాలు భోజన ప్రియులను ఊరిస్తున్నాయి. ఫలితంగా తమ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసుకుంటున్నారు.
కథలాపూర్, చింతకుంట ప్రత్యేకత
కథలాపూర్ మండలంలోని చింతకుంట, కథలాపూర్ గ్రామాల్లోని మహిళలు అందరికన్నా విభిన్నంగా ఆలోచించారు. పిండి వంటకాల తయారీని వ్యాపారంగా ఎంచుకున్నారు. ఎనిమిది మంది మహిళలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఈ పిండి వంటలు తయారు చేస్తున్నారు. వీటి తయారీ విషయం తెలుసుకున్న వివిధ మండలాల భోజన ప్రియులు ఇక్కడికి వచ్చి వారికి అవసరమైన పిండి వంటకాలను కొనుగోలు చేస్తున్నారు. కథలాపూర్, చింతకుంట మహిళలు తయారుచేసే పిండి వంటకాలను కథలాపూర్ మండలంతో పాటు కోరుట్ల, రుద్రంగి మండల వాసులు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. వీరు నెలకు రూ.50వేల వ్యాపారం చేస్తున్నారు. యేడాదిలో సుమారు రూ.6 లక్షల వరకు వ్యాపారం అవుతుండగా, ఇందులో అన్ని ఖర్చులు పోనూ దాదాపు రూ.2.50 లక్షల వరకు మిగులుతుందని మహిళలు పేర్కొంటున్నారు.
తయారు చేసే పిండి వంటకాలివే..
మహిళలు తక్కువ సమయంలో ఆర్థికంగా ఎదగాలని పిండి వంటకాలు తయారు చేస్తున్నారు. భోజన ప్రియులకు ఇష్టమైనవి కేవలం పండుగలప్పుడే దొరికే గారెలు, సకినాలు, వడలు, లడ్డూలు, మక్కగుడాలు, బూరెలు, అరిసెలు, కారం రింగులు ఇలా.. వివిధ రకాల పిండి వంటకాలను తయారు చేస్తున్నారు. కొందరు భోజన ప్రియులు కొని ఇక్కడే తింటుండగా.. మరికొందరు తమ కుటుంబ అవసరాల కోసం ఇండ్లలోకి తీసుకెళ్లేందుకు ముందస్తు ఆర్డర్లు ఇస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. పిండి వంటకాల తయారీకి కొద్దిగా శ్రమ ఉన్నా వ్యాపార పరంగా లాభాలు వస్తున్నాయని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సెర్ప్ అధికారులు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.
భిన్నంగా ఉంటుందనే..
గ్రామీణ ప్రాం తాల్లోని మహిళ లు వ్యాపార రంగాల్లో రాణించాలని కిరాణా షాపులు, కుట్టుశిక్షణ కేంద్రాలు, పుస్తకాల విక్రయాలు చేస్తున్నారు. వీటిలో లాభాలు అంతంతే వస్తున్నాయి. కాస్త భిన్నంగా ఆలోచించి పిండి వంటకాలు తయారుచేస్తే ఎలా ఉంటుందని మహిళలు అందరం కలిసి చర్చించుకున్నాం. 10 రోజులపాటు సన్నాహాలు చేశాం. పిండి వంటకాల తయారీని ప్రారంభించాం. మొదట్లో కష్టం అనిపించినా ఇప్పుడు సాధారణం అయిపోయింది. గిరాకీ కూడా బాగానే ఉంది. పిండి వంటకాలు ఎక్కువగా అమ్ముడవుతుండడం ఆనందంగా ఉంది.
– సామోజీ రమాదేవి, నిర్వాహకురాలు (చింతకుంట)
తక్కువ ఖర్చులతో లాభాలు..
మహిళలు పొదుపు సంఘాలుగా ఏర్పడి వ్యాపారం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కొంచెం కష్టం అనిపించినా పిండి వంటకాలకు తక్కువ ఖర్చు అవుతుంది. రుచిగా ఉండడంతో అమ్మకాలు పెరిగి లాభాలు కూడా పెరిగాయి. మహిళలందరం కలిసి చేసిన పిండి వంటకాలతో ఆర్థికంగా నిలదొక్కుకుంటుండడం సంతోషంగా ఉంది.
– అన్నం మధురిమ, నిర్వాహకురాలు (చింతకుంట)