రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయి. ప్రత్యేక కార్యక్రమం పల్లె ప్రగతితో గ్రామాల్లో ఇప్పటికే పట్టణ స్థాయి వసతులు సమకూరాయి. సైదాపూర్ మండలంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి ఇటీవల భారీగా నిధులు కేటాయించగా, త్వరలోనే సీసీ రోడ్లు అందుబాటులో రానుండడంపై గ్రామీణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
-సైదాపూర్, ఫిబ్రవరి 12
గత ప్రభుత్వాల పాలనలో గ్రామాల్లో అంతర్గత రహదారులను పట్టించుకునేవారు కరువయ్యారు. గుంతలు పడి.. ఎండాకాలం దుమ్ము లేస్తూ.. వానకాలం బురదతో నిండే దారుల వెంట దశాబ్దాలుగా ప్రజలు రాకపోలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిన తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ ప్రగతి బాటలు వేస్తున్నది. మండలంలోని వివిధ పంచాయతీల్లో గ్రామీణ అంతర్గత రహదారుల్లో సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించగా త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మండలకేంద్రంలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడం.. మట్టిరోడ్డుపైనే ప్రయాణించాల్సి రావడంతో ప్రజలు ఏండ్ల తరబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి రూ.50లక్షల నిధులు మంజూరు చేయించారు. దీంతో పాటు వివిధ గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలకు కూడా రూ.2.30 కోట్ల నిధులు మంజూరు కావడంతో త్వరలోనే పనులు జరుగనున్నాయి.
మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం హర్షణీయం. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలకు వెళ్లే రహదారి మంజూరు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగానే ఆయన వెంటనే స్పందించి పరిష్కరించారు.
– సారబుడ్ల ప్రభాకర్రెడ్డి,
ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నది. పలు గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలకు 2.30 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సతీశ్కుమార్ సహకారంతో గ్రామాల్లోని సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయి.
– చంద శ్రీనివాస్,
సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు
మండలకేంద్రంతో పాటు, గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి 2.80కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలకు భారీగా నిధులు కేటాయిస్తుండడంతో అభివృద్ధి వేగంగా జరుగుతున్నది.
– సోమారపు రాజయ్య,
బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు
మండలకేంద్రంలోని వెన్కేపల్లి గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వివిధ పనులపై వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్యే సతీశ్కుమార్ రూ.50లక్షల నిధులు మంజూరు చేయడం సంతోషకరం. సీసీరోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి.
– కొండ గణేశ్, వెన్కేపల్లి సర్పంచ్