ఒకప్పుడు తీవ్ర కరువు ప్రాంతమైన మానకొండూర్ నియోజకవర్గం, ఇప్పుడు ప్రగతి బాటలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక కృషితో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలుస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులు, చెక్డ్యాంలు, కాలువల నిర్మాణంతో మెట్టప్రాంతానికి గోదావరి జలాలు పరుగులు తీశాయి. ఒకప్పుడు ఎడారిని తలపించిన చెరువులు, కుంటలు ఇప్పుడు నిండుకుండల్లా మారి మండు వేసవిలోనూ మత్తళ్లు దుంకాయి. భూములన్నీ సస్యశ్యామలంగా మారి, రెండు సీజన్లలోనూ బంగారు పంటలు పండుతున్నాయి. ఇంకోవైపు గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో వేలాది కోట్లతో పనులు చేపట్టగా, పల్లెలు ప్రగతి పథంలో ముందుకెళ్తున్నాయి. రోడ్లు, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనతో సరికొత్తగా మారడమే కాదు, స్వచ్ఛతలోనూ మెరుస్తున్నాయి.
-కరీంనగర్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ)/ తిమ్మాపూర్
ఒకప్పుడు నీళ్లంటే ఎరుగని ఈ ప్రాంతంలో ఇప్పుడు జలసిరి ఉట్టిపడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇల్లంతకుంట మండలంలో 2,900 కోట్లతో నిర్మించిన అనంతగిరి ప్రాజెక్టుతో ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాలు సస్యశ్యామలంగా మారాయి. ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. నాడు వానకాలంలో సైతం నీళ్లంటే ఎరుగని ఈ ప్రాంత చెరువులు, కుంటలు ఇప్పుడు నిండు వేసవిలో కూడా మత్తళ్లు దుంకుతున్నాయి. కాళేశ్వరం నీళ్లతో పుష్కలమైన పంటలు పండుతున్నాయి. ఎస్సారెస్పీ పరిధిలోకిరాని తిమ్మాపూర్, మానకొండూర్ మండలాలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాలువలు తవ్వించడంతో జలాలు పరుగులు తీస్తున్నాయి. అనంతగిరి ప్రాజెక్టుకు ఆనుకొని 2,700 కోట్ల భారీ వ్యయంతో తిప్పాపూర్ సర్జ్పూల్ను నిర్మించారు.
ఇది ఆసియాలోనే అతిపెద్దది. 62 మీటర్ల ఎత్తు, 95 మీటర్ల లోతుతో ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎగువకు ఈ సర్జిపూల్ ద్వారానే ఎత్తిపోస్తారు. దీని నుంచే అనంతగిరి ప్రాజెక్టుకు కాళేశ్వరం నీరు వెళ్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు జలాశయం నుంచి 4 వేల కోట్ల నిధులతో కుడికాలువను నిర్మించి, తోటపల్లి రిజర్వాయర్కు లింక్ చేశారు. దీంతో తోటపల్లి రిజర్వాయర్లో టీఎంసీ నీరు ఎల్లవేళలా అందుబాటులో ఉండడంతో పలు మండలాలకు నిత్యం సాగునీరు అందిస్తున్నారు. అలాగే మిషన్ కాకతీయ కింద నాలుగు విడతల్లో 138.38 కోట్లతో 365 కుంటలను పునరుద్ధరించారు. కాళేశ్వర జలాలతో వీటిని నింపుతున్నారు. ఏ గ్రామంలో చూసినా దాదాపు కుంటలన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఐదు చెక్ డ్యాంలు నిర్మించడంతో వాగులు సజీవంగా మారాయి. దీంతో భూగర్భజలాలు ఉబికి వస్తున్నాయి. బావులు, బోర్లలో నీటి మట్టం పెరిగి నీటి కొరత లేకుండా పోయింది.
గతంలో నియోజకవర్గంలోని ఏ పల్లెకు వెళ్లే దారి చూసినా అధ్వానంగా కనిపించేది. ప్రధాన దారులు సైతం అలాగే ఉండేవి. కానీ, స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృషితో అభివృద్ధి పరుగులు పెట్టింది. మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల్లో రోడ్లు అద్దల్లా మారాయి. నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం ఈ యేడాదిలోనే 26.20 కోట్లతో సీసీ రోడ్లు వేశారు. ఇంకా అనేక గ్రామాల్లో పనులు ప్రగతిలో ఉన్నాయి. మానకొండూర్ మండలం వేగురుపల్లి, సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మధ్యన మానేరు వాగుపై 40.20 కోట్ల నిధులతో అద్భుతమైన బ్రిడ్జి నిర్మించారు. దీంతో మానకొండూర్ నుంచి సుల్తానాబాద్కు రవాణా మెరుగుపడి దూరభారం తగ్గింది. శంకరపట్నం మండలం ఎరడపల్లి నుంచి ముత్తారం మధ్యలో ఒర్రె బ్రిడ్జిని నిర్మించారు.
పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్లాయి. ప్రధానంగా గ్రామాలు స్వచ్ఛతలో ఆదర్శంగా నిలిచాయి. ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ, డంప్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్లతో పరిశుభ్రంగా మారాయి. పల్లెప్రకృతి వనం, శ్మశానవాటికలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంతోపాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. అలాగే గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘మన ఊరు -మన బడి’తో పెనుమార్పులు తీసుకొచ్చారు. ఈ పథకం కింద మొదటి విడతలో 10 కోట్లపై చిలుకు నిధులతో ఆరు మండలాల్లోని 85 పాఠశాలను ఆధునీకరించారు. దీంతో పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకుంటున్నారు.
రైతులకు విద్యుత్ కోతలు లేకుండా ఉండేందుకు 25 కోట్ల నిధులతో శంకరపట్నం మండలం కాచాపూర్, ఎరడపల్లి, గన్నేరువరం మండలం జంగపల్లిలో రెండు సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటితోపాటు పలు మండలాల్లో ఐదు సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా మండలాల పరిధిలోని గ్రామాల రైతులకు, గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సదుపాయం కలిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అన్ని మండలాల్లో అరుంధతి కల్యాణ మండపం, మానకొండూర్ మినీ ట్యాంక్ బండ్, నియోజకవర్గ మినీ స్టేడియం, సీఎం రిలీఫ్ ఫండ్స్, గ్రామపంచాయతీ బిల్డింగ్లు, మహిళా బిల్డింగ్లు నిర్మించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అభివృద్ధి చేసి చూపించారు.
స్వరాష్ట్రంలో సంక్షేమం గడపగడపకూ చేరుతున్నది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు, రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు.. ఇలా ఎన్నో పథకాలను ఇంటింటికీ అందిస్తున్నది. రాష్ట్రం రాకముందు వృద్ధులు, అభాగ్యులకు అరకొర పింఛన్లే అందేవి. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ పింఛన్ల మొత్తాన్ని ఏకంగా 2 వేలకు పెంచారు. నియోజకవర్గంలో ప్రతి నెలా 39,559 మందికి 8.36 కోట్ల పైచిలుకు అందిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఆసరాతో ఎంతో మంది గౌరవంగా బతుకుతున్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే పింఛన్లను 5వేలు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.