Koppula Eshwar | కోల్ సిటీ, ఏప్రిల్ 26 : అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్-స్నేహలత దంపతులు పేర్కొన్నారు. గోదావరిఖని జవహర్ నగర్ లో గల శ్రీశ్రీశ్రీ జయదుర్గా దేవి ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయంలో లోక కల్యాణార్థం ప్రత్యేక చండీహోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు ముందుగా అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, మంగళహారతి, యజ్ఞం నిర్వహించారు.
అనంతరం లోక కల్యాణార్థం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక చండీహోమం నిర్వహించారు. వేడుకలకు అశేష భక్తులు తరలిరాగా తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం సహపంక్తి భోజనాలు నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. అత్యంత శక్తి స్వరూపిణి అమ్మ దయ రామగుండం నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన తొలి సీఎం కేసీఆర్ పాలన మళ్లీ రాబోతుందని జోస్యం చెప్పారు. రెండేళ్లలోనే ప్రజలు కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, వేల సంఖ్యలో భక్తులు తరలిరాగా అమ్మవారి నామస్మరణంతో ఆలయం మార్మోగింది.