పెద్దపల్లి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు వద్ద ఉంటుందీ కంచెర బావి. వందేళ్ల కింద ఓ ఈ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చి, బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. తాగేందుకు చుక్కనీరు దొరకని పరిస్థితి. స్థానికంగా నివాసం ఉండి కులవృత్తి చేసుకొని పొట్టపోసుకునే కంచెర కులస్తులు ఇక్కడ బావి తవ్వాలని నిర్ణయించుకున్నారు. పలువురి సాయం తీసుకొని పెద్దపల్లి శివారులోని కంచెరుల కాట్నాల (శ్మశానవాటిక) స్థలంలో దాదాపు 40రోజుల పాటు శ్రమించి 30 గజాల చేద బావిని తవ్వారు.
ఆ సమయంలో పుష్కలమైన జలాలతో ఈ ప్రాంత ప్రజల దాహం తీర్చిన ఈ పాతాళ గంగ, క్రమంగా కంచెర బావిగా పేరొందింది. వేసవిలో భూగర్భజలాలు అడుగంటిపోయి చుట్టు పక్కల బోర్లు, బావులన్నీ ఎండిపోయిన సందర్భాల్లోనూ బావిలో నీళ్లు ఉండడం ఈ బావి ప్రత్యేకత. అయితే 60 ఏళ్ల క్రితం మాత్రం బావిలో నీళ్లు తగ్గిపోవడంతో మళ్లీ లోతుగా తవ్వించారని, అప్పటి నుంచి ఇప్పటివరకు అడుగంటిన దాఖలాలు లేవని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ బావి నీళ్లు మినరల్ వాటర్ కన్నా రుచిగా, స్వచ్ఛంగా.. మండువేసవిలోనూ చల్లగా ఉంటాయని చెబుతున్నారు. నీరు తాగితే మోకాళ్లు, కీళ్ల నొప్పులు రావని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే స్థానికులతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం ఉదయం, సాయంత్రం ఇక్కడికి వచ్చి క్యాన్లలో నీటిని తీసుకెళ్తున్నారు.
శతాబ్ద కాలంగా ప్రజల గొంతు తడుపుతున్న అపురూప జలకుడ్యం పెద్దపల్లిలోని కంచెర బావి. నాడు కరువు కాటకాల సమయంలో కంచెర కులస్తులు తవ్వించిన ఈ బావి, చరిత్రకు అద్దంపడుతున్నది. వందేళ్లయినా చెదరని దర్పంలా.. ఇప్పటికీ తరగని జలసంపదతో అలరారుతున్నది. ఈ పాతాళ జలం తాగితే రోగాలు దరిచేరవనే నమ్మకంతో ఇప్పటికీ పలువురు తీసుకెళ్తుండగా, నీటి అమ్మకాల ద్వారా పలువురికి జీవనోపాధి చూపుతున్నది.
ఈ బావి నీటి కొరత తీర్చడంతో పాటు పలువురికి జీవనోపాధిని కల్పిస్తున్నది. నీటిపై ప్రీతి ఉండి ఇక్కడికి వచ్చి తీసుకెళ్లలేని వారికి సరఫరా చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రధానంగా పట్టణానికి చెందిన పది కుటుంబాలు ఇప్పటికీ ఈ బావిపై ఆధారపడే బతుకుతున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం డ్రమ్ముల్లో నీటిని తీసుకెళ్లి హోటళ్లు, కార్యాలయాలు, ఇండ్లలో విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. దూరాన్ని బట్టి డబ్బులు తీసుకుంటారు. సాధారణంగా 20 లీటర్ల క్యాన్కు రూ.10 తీసుకుంటారు.
నేను 15 ఏండ్ల నుంచి ఈ కంచర బావి నీళ్లను విక్రయిస్తున్న. ప్రతి రోజూ చాలా మంది ఫోన్ చేసి నీళ్లు తెమ్మంటున్నరు. కానీ, అందరికీ సైప్లె చేయలేకపోతున్న. కొన్ని కుటుంబాలైతే అసలు కంచర బావి నీళ్లు తప్ప ఏ నీళ్లు తాగరు. దాదాపు 20 కుటుంబాలు నాకు రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నరు. కొన్ని హోటళ్ల నిర్వాహకులు సైతం ఈ నీళ్లను తమ కస్టమర్లకు అందిస్తున్నరు. ఈ నీళ్లతోనే వాళ్లకు గిరాకీ వస్తున్నదని అంటున్నరు.
– నాగరాజు, నీటి విక్రయదారు (పెద్దపల్లి)
పెద్దపల్లిలోని ప్రజలందరూ ఇక్కడి కంచర బావి నీళ్లే తాగుతరు. ఇరవై ఏండ్లుగా ఈ నీళ్లమ్మే మాకుటుంబాన్ని పోషించుకుంటున్న. సైకిల్ రిక్షాకు ట్యాంకు ఏర్పాటు చేసుకొని ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇంటింటికీ సరఫరా చేస్తున్న. ఇంకా చాలా మంది అడుగుతూనే ఉన్నరు. ప్రతి రోజు నాలుగు, ఐదు ట్రిప్పుల నీళ్లను విక్రయిస్తున్న. ఒక ట్రిప్పు నీళ్లు అమ్మితే నాకు రూ.200 దొరుకుతయి.
– ఎండీ ఖాదర్, నీటి సరఫరాదారు (పెద్దపల్లి)