ఏ పనీ చేయలేని వృద్ధులు, దివ్యాంగులు.. దిక్కూ మొక్కూలేని ఒంటరి మహిళలు, ఏ ధీమా లేని అసహాయులు.. ప్రభుత్వ వైద్యమే అపర సంజీవనిగా భావించి వచ్చే గర్భిణులు, ఎదిగొచ్చిన బిడ్డ పెండ్లి చేసేందుకు నానాపాట్లు పడే నిరుపేద తల్లిదండ్రులు.. ఏళ్లుగా నమ్మిన కులవృత్తే జీవనాధారంగా బతికే దీనార్థులు.. ఇంకా బీడీ కార్మికులు, పైలేరియా, హెచ్ఐవీ బాధితులకు బీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తున్నది. ప్రభుత్వ ఖజానాపై ఎంత ఆర్థిక భారం పడ్డా.. ఎన్ని కష్టాలు ఎదురైనా దేశమే ఆశ్చర్యపోయేలా బృహత్తర పథకాలు అమలు చేస్తూ సం‘క్షేమాని’కి తోడై నిలుస్తున్నది. ముఖ్యంగా ‘ఆసరా’ సకలజనులకు కొండంత భరోసా కల్పిస్తున్నది. తొమ్మిదేండ్లలోనే లబ్ధిదారుల సంఖ్య రెండింతలు కాగా, ఉమ్మడి జిల్లాలో 5,88,589 మందికి ప్రతి నెలా 125.38 కోట్ల సాయం అందుతున్నది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే లెక్కకు మించిన స్కీంలు తెచ్చి పేదల పెన్నిధిగా మారిన ప్రభుత్వం, తాజాగా దివ్యాంగులకు మరో వెయ్యి పెంపుపై, కొత్తగా మూడు పథకాలకు శ్రీకారం చుట్టి సబ్బండవర్గాల్లో సంతోషాన్ని నింపింది.
– కరీంనగర్, జూన్ 11(నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 11(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా కనిపించవు. ప్రభుత్వ ఖజానాపై ఎంత ఆర్థిక భారంపడ్డా, ఎన్నికష్టాలు ఎదురైనా పథకాలు అమలు లో రాష్ట్ర సర్కారు ఏనాడూ వెనుకడుగు వేయలేదు. అనేక సంక్షేమ పేదల కోసం రూపొందించి అమలు చేస్తున్నవే. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఆసరా పెన్షన్లు. ఈ పథకం కింద ఎందరో నిరుపేదలకు ప్రయోజనం చేకూరుతోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత, నేత, బీడీ కార్మికు లు, ఒంటరి మహిళలు, పైలేరియా, హెచ్ఐవీ వ్యాధి గ్ర స్తులకు కూడా పెన్షన్ ఇస్తూ కొండంత అండగా నిలుస్తున్నది. తాజాగా దివ్యాంగులకు వెయ్యి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది..
‘ఆసరా’ భరోసా..
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో ప్రవేశపెట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత ఆర్థిక భారం కలిగినా ఎక్కడా వెనకడుగు వేయడంలేదు. అత్యంత ప్రజాదరణ పొందుతున్న పథకాల్లో ఆసరా పెన్షన్ ఒకటి. 2014కు ముందు దివ్యాంగులకు 500, ఇతర కేటగిరీల వారికి కేవలం 200 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ఆసరాగా మార్చేశారు. 2014 ఆగస్టు నుంచే దివ్యాంగులకు 1,500, ఇతర కేటగిరీ వారికి వెయ్యి చొప్పున పెంచి అమలు చేస్తున్నారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఇచ్చి న హామీని నిలబెట్టుకుంటూ 2019 ఏప్రిల్ నుంచి దివ్యాంగులకు 3,016, ఇతర వర్గాలకు 2,016 చొప్పున పెంచి అమలు చేస్తున్నారు. గతంలో 65 ఏం డ్లు ఉన్న వారికే పెన్షన్ పొందే అర్హతఉండేది. 2020 మార్చి నుంచి ఈ వయోపరిమితిని 57ఏండ్లకు తగ్గించగా, చాలామందికి పెన్షన్పొందే అవకాశం వచ్చింది.
పెరిగిన సాయం.. రెండింతలైన లబ్ధిదారులు..
ఆసరా పెన్షన్ల కింద 2014కు ముందు కేవలం 200, 500కు పరిమితమైన ఆసరా పెన్షన్లు ఇపుడు ఊహించని రీతిలో పెరిగాయి. అప్పట్లో ఇచ్చిన మొత్తం లబ్ధిదారులకు కేవలం కంటి తుడుపుగా మాత్రమే ఉం డేవి. ఏ అవసరానికి పనికి వచ్చేవి కావు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్ పొందుతున్నా ఒకరిపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఉండేవి. ఇపుడు ఏ కేటగిరిలోని పెన్షన్ చూసినా ప్రతి ఒక్కరికి ఆసరాగా నిలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు 3,28,639 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండేవారు. ఆ సమయంలో కేవలం నెలకు 12 కోట్లకు మించి పంపిణీ జరిగేది కాదు. కానీ బీఆర్ఎస్ పాలనలో ఈ తొమ్మిదేళ్లలో పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే ఉమ్మ డి జిల్లా పరిధిలో చూస్తే ఇపుడు కరీంనగర్లో 1,41, 344, జగిత్యాలలో 2,28,351, పెద్దపల్లిలో 97,752, సిరిసిల్లలో 1,21,142మంది చొప్పున మొత్తం 5,88, 589మందికి ప్రతినెలా 125.38 కోట్ల పెన్షన్ పొందుతున్నారంటే గడచిన తొమ్మిదేళ్లలో ఈ పథకం కింద ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటికీ ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 2,59,950 మంది ఆసరా లబ్ధిదారులు పెరిగారు.
మరెన్నో మానవీయ పథకాలు
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకం వెనుక మానవీయ కోణం కనిపిస్తోంది. ఆసరా పెన్షన్లలో చూస్తే కన్న వారికి భారమవుతున్న తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఎంతో ఆసరాగా నిలుస్తోంది. ఇపుడు 57 ఏండ్లకు కుదించడంతో చాలా మందికి ఆసరా అవుతోంది. ఏదో కారణం చేత భర్తలు చనిపోతే వితంతువు పెన్షన్ 18 ఏండ్ల వయసుకే ఇస్తున్నారు. గీత, నేత కార్మికులకు 50ఏండ్లకే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దివ్యాంగులకు వయసుతో పనిలేకుండా పెన్షన్ ఇస్తున్నా రు. ఇటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కూడా అత్యంత మానవీయ కోణం కనిపించే పథకాలే. నిరుపేద కుటుంబాలు ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నారో అర్థం చేసుకున్న కేసీఆర్, ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. వివాహితలు గర్భందాల్చిన నుంచి మొదలు పురుడు పోసుకునే దాకా ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు. తాజాగా న్యూట్రిషన్ కిట్స్ ప్రవేశపెట్టి పిల్లలకు బలవర్ధక ఆహారం అందించి మంచిపౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు దాటినా నీడలేని నిరుపేదలు ఎందరికో ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. ఇటు దళితులకు దళితబంధు పథకం ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి 10లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీ పథకం తెచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న ప్రతి పథకంలో మానవీయ కోణం కనిపిస్తోంది.
సర్కారుది పెద్ద మనుసు
నా భర్త భూమయ్య కల్లుగీస్తెనే మాకు ఐదువేళ్లు నోట్లెకు పొయ్యేది. మాకు బిడ్డ, కొడుకు ఉన్నరు. కాయకష్టం జేసి సంపాదించిన పైసలతోని బిడ్డ పెండ్లి జేసినం. ఐదేండ్ల కింద నా భర్తకు గుండెపోటు వచ్చింది. పెద్ద దావకాండ్లకు పోదామంటే చేతుల చిల్లిగవ్వ లేదు. నా పెనిమిటి పాణం దక్కించుకు నేందుకు మా అత్త మామల నుంచి వచ్చిన ఇల్లు అమ్మితే దావ కాండ్ల ఖర్చుకుగుడా సరిపోలే. అప్పుదెచ్చి నా భర్తను కాపాడుకున్నం. ఇప్పుడిప్పుడే మంచిగై మల్లా కలాలి పనులు జేత్తండు. నేను బీడీలు చేసి ఇల్లు గడుపుతున్న. ఇల్లు లేక తల్లడిత్తన్న మా బాధను అర్థం జేసుకు న్న ఎమ్మెల్యే రవిశంకరన్న గంగాధరకు పిలిచి ఇంటి పట్ట ఇచ్చిండ్రు. పేదోళ్ల సర్కారుది పెద్ద మనుసు.
– ఏపూరి లక్ష్మి, లబ్ధిదారు, గోపాల్రావుపేట (రామడుగు)
మనసున్న మహారాజు సీఎం కేసీఆర్
రాష్ట్ర సాధనకు అలుపెరుగని పోరాటం చేసి చావు చివరి అంచుల దాకా వెళ్లివచ్చి తెలంగాణ కల సాకారం చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి భరోసా కల్పిస్తున్నరు. ముఖ్యంగా ఆసరా పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు అండగా నిలుస్తున్నరు. రెండ్రోజుల క్రితం మంచిర్యాల సభలో దివ్యాంగులకు ప్రస్తుతం ఇచ్చే 3,016ను మరో వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించి ఆనందాన్ని నింపారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 13,502 మంది దివ్యాంగులకు ప్రతి నెలా 4.60 కోట్ల సాయం అందుతోంది. పెంచిన వెయ్యితో 1.35కోట్ల అదనపు ప్రయోజనం దక్కుతుంది.
– బొద్దుల లక్ష్మణ్, జూలపల్లి జడ్పీటీసీ, కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
లక్షతో వ్యాపారం చేసుకుంట..
నా పేరు తిప్పర్తి సురేశ్, మాది మల్లాపూర్ మండల కేంద్రం. నేను గోల్డ్స్మిత్ వర్క్ చేసుకుంటూ ఉపాధి పొందుతున్న. బీసీ కులాలకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తుండడం సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలు మమ్ముల ఆదుకోలె. ఏ సాయం చేయలేదు. బీఆర్ఎస్ పాలనలోనే మాకు భరోసా దొరికింది. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో బీసీ కార్పొరేషన్ లోన్కు దరఖాస్తు చేసుకున్న. నన్ను లబ్ధిదారుడిగా ఎంపిక చేసిన్రు. వచ్చిన లక్ష రూపాయలతో మా గ్రామంలో దుకాణం పెట్టుకోని లక్షణంగా వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటా. ప్రభుత్వానికి రుణపడి ఉంటా.
– సురేశ్, బీసీ కార్పొరేషన్, లబ్ధిదారుడు (మల్లాపూర్)
సార్కు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..
నేను ఎంఏ బీఈడీ చేసి. స్థానికంగా ఆన్లైన్ సెంటర్ నడుపుతున్న. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 3,016 పింఛన్తోనే ఆత్మ గౌరవంగా బతుకుతున్నా. దివ్యాంగు లంటే సీఎం సార్కు ఎంతో అభిమానం. అందుకే దేవుడిలాగ అదనంగా 1,000 పెంచుతూ వచ్చే నెల నుంచి 4,116 ఇస్తామ ని ప్రకటించడం సంతోషంగా ఉంది. సార్కు ఏమిచ్చి రుణం తీర్చుకో గలం. స్వరాష్ట్రంలోనే దివ్యాంగుల బతుకులు మారినయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించే గౌరవప్రదమైన పింఛన్తోనే సంతోషంగా బతుకు వెళ్లదీస్తున్నాం. మాకాళ్లపై మేం నిలబడేందుకు సీఎం ఆందిస్తున్న సాయం మరింత బలాన్ని ఇచ్చింది. సీఎం సార్కు ఎల్లవేళలా నా కుటుంబమంతా రుణపడి ఉంటది.
– ఇల్లుటపు యాదగిరి, దివ్యాంగుడు(కోరుట్ల)
మళ్లా సారు, కారు ప్రభుత్వమే వస్తది..
నిలువ నీడలేని మేం కిరాయికి ఉంటూ జీవిస్తుంటే, మాకు ప్రభుత్వ భూమిలో పట్టా ఇచ్చి శాశ్వతంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు మేం జీవితాంతం రుణపడి ఉంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో బట్ట, పొట్టకే సంపాదించుడు కష్టం కాగా, కిరాయికి ఉండలేక, జాగా కొనుకోలేక ఇబ్బందులు పడుతున్న మాలాంటి వారికి, ప్రభుత్వమే పిలిచి పట్టా ఇవ్వడం పేదల సంక్షేమంపై కేసీఆర్ సార్ చూపుతున్న పెద్ద మనసు అర్థమవుతుంది. 10 లక్షలు పెట్టినా ఈ భూమి దొరకదు. అట్లాంటిది మాకు నయా పైసా లేకుండా ఇల్లడుగు జాగకు పట్టా ఇవ్వడంతో, మా కుటుంబం జీవితాంతం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. మళ్లా సారు, కారు ప్రభుత్వమే వస్తది. మాకు మరింత మేలు చేస్తది..
– సుద్దాల రాజేశ్వరి, బద్దిపల్లి, కొత్తపల్లి మండలం (కార్పొరేషన్)
జీవితాలు నిలబడ్డయి..
కులవృత్తులను గుర్తించి ఆర్థిక భరోసా ఇచ్చి ఆదరణ కల్పించిన నాయకుడు సీఎం కేసీఆర్. కనీసం నాలుగు గొర్లు కూడా కొనుక్కొని బతుకలేని పరిస్థితిలో ఉన్న మాలాంటోళ్లకు 21 గొర్లు అందజేసి బతుకుపై ఆశలు కల్పించిండు. ఇప్పుడు మంద పెరిగి ఆదాయం వస్తున్నది. మార్కెట్ల మాంసానికి మంచి గిరాకీ ఉంది. సమైక్య పాలనలో మేకలు, గొర్లు లేక ఉపాధి లేక బయట దొరికిన పని చేసుకొని బతికెటోళ్లం. చాలీచాలని బతుకులు ఎల్లదీసెటోళ్లం. సీఎం కేసీఆర్ మా బాధలు గుర్తించి గొర్లు పంపిణీ చేసిండు. వాటితో వచ్చిన ఆదాయంతో నేను, నా కుటుంబం సంతోషంగా బతుకుతున్నం. ఒకప్పటి కష్టాలు ఇప్పుడు లేవు. మా జీవితాలు నిలబడ్డయి. గొర్లు కాస్తూ యజమానిలా బతుకుతున్న.
– గిరవేన సమ్మయ్య యాదవ్, నర్సింగాపూర్ల్(వీణవంక)
సాయం జేసిన చేతులు సల్లగుండాలె..
నా భర్తను మా ఊళ్లే గుడిసె చంద్రయ్య అంటరు. మాకు ఉండేతందుకు ఇల్లులేక గుడిసెల ఉంటున్నం. బతుకుదెరువు లేక నా పెనిమిటి కొన్నొద్దులు ఊరు చాటింపు పని చేసిండు. ఇప్పుడు ఇద్దరం కైకిలిపొయ్యి బతుకుతున్నం. మాకు ఒక్కడే కొడుకు. వానకాలం గుడిసె మస్తు ఊరుస్తది. ఇటు సంపాదన లేక, అటు ఉండేతందుకు ఇల్లు లేక మస్తు గోసవడ్డం. సాయం జెయ్యాలని ఎమ్మెల్యే సారును బతిలాడినం. కడుపులపెట్టుకొని కాపాడుకుంటమన్నరు. ఫికర్ జెయ్యకుండ్రని చెప్పి ఇంటిస్థలం ఇస్తనన్నరు. అన్నట్టుగనే మా ఊళ్లే మాకు ఇంత భూమి ఇచ్చి, పట్టగుడా చేతుల పెట్టిండ్రు. నిన్నమొన్నటి దాక ఏమిలేనోళ్లం ఇయ్యాల్ల సర్కారు సాయంతోని ఇంటిస్థలం దొరికింది. సాయం జేసిన చేతులు సల్లగుండాలే.
– దాసరి జయ, లబ్ధిదారు, గోపాల్రావుపేట (రామడుగు)
మాకింత భరోసా దొరికింది..
మావి గుంట భూమిలేని జీవితాలు. నలభై ఏండ్లకింద ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లనే మా అత్తమామతోని కలిసి అందరం ఉంటున్నం. నా భర్త రాజయ్య దినసరి కూలి, మాకు ఇద్దరు ఆడపిల్లలు. మాకు ఉండేతందుకు ఇంత జాగ కావాలని ఎమ్మెల్యే సారును అడిగినం. ఆదుకుంటమని హామీ ఇచ్చిండు. స్థలం జూసినంక ఇస్తం బిడ్డా అన్నరు. గియాళ్ల ఇంత భూమి ఇచ్చి ఆదుకున్నరు. మాసొంటి పేదోళ్లకు నాడు ఇందిరమ్మ ఇండ్లిచ్చింది, నేడు కేసీఆర్ సారు జాగ ఇచ్చిండు. మా జీవితాలకు ఇంత భరోసా దొరికింది.
– రేణికుంట సరోజన, ఇంటిపట్టా అందుకున్న లబ్ధిదారు, గోపాల్రావుపేట (రామడుగు)
బతుకుదెరువు దొరుకుతది..
రాష్ట్రంలో వెనుకబడ్డ కులాలకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటంది. బీసీలకు రూ.లక్ష ఇస్తంది. లక్ష రూపాయలతో బతుకుదెరువు దొరుకుతది. గత ప్రభుత్వాలు మమ్ముల ఏనాడూ పట్టించుకోలే. ఓట్ల టైం అచ్చి ఇది చేస్తం.. అది చేస్తం అనుడే గానీ ఏ ఒక్కటీ చేసింది లేదు. గెలిచేదాక ఓ మాట.. గెలిచిన తర్వాత మమ్ముల మరిచిపోతుండె. నేను లాండ్రీ షాపు నడిపించుకుంట బతుకుతున్న. కేసీఆర్ సారు మాకు ఉచితంగా 250యూనిట్ల కరెంట్ ఇస్తండు. ఫ్రీ కరెంట్తో మాకు ఎంతో లాభమైతంది. ఇప్పుడు ఇచ్చే లక్ష రూపాయలతో షాప్ను డెవలప్ చేస్త. ఇంత గొప్ప సాయం చేస్తున్న సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటం.
– ఆకునూరి మల్లయ్య, హిమ్మత్రావుపేట (కొడిమ్యాల)
మందలు తయారైతున్నయి..
ఒకప్పుడు వందలాది గొర్లు, మేకలతో ఎంతో దర్జాగా బతికిన మా యాదవ కులస్తులు రానురాను మస్తు దెబ్బతిన్నరు. ఉన్న గొర్ల మందలన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోయినయి. ఉపాధి లేక ఎంతో మంది వలసలు పోయిన్రు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మా కుటుంబాలకు గొర్రెల పంపిణీ పథకం తెచ్చి భరోసా ఇచ్చిన్రు. ఒక్కొక్కరికి 21 గొర్రెలు పంపిణీ చేసిండు. నాడు జీవాలు లేక పొట్టచేత పట్టుకొని వలస పోయినవారంతా వాపస్ వస్తున్నరు. గొల్ల,కుర్మల జీవితాలు నిలబడ్డయి. ఇప్పుడు సర్కారు ఇచ్చిన గొర్రెలతో సంపద పెరిగింది. మళ్లీ అందరి దగ్గర మందలు తయారైతున్నయి. గొప్ప పథకాన్ని తెచ్చిన ప్రభుత్వానికి ధన్యావాదాలు.
– జక్కుల మల్లేశం (కొడిమ్యాల)