కలెక్టరేట్, జూన్ 24: పేద, మద్య తరగతి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ వసతి గృహాలు సకల వసతుల సమాహారంగా మారాయి. ఉమ్మడి పాలనలో కనీస సౌకర్యాలు కరువై రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన వారు కూడా వాటిలో వసతి పొందేందుకు నిరాసక్తత కనబర్చేవారు. సీట్ల భర్తీ కోసం నాటి హాస్టల్ వార్డెన్లు బహు తిప్పలు పడేవారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించేందుకు నానా తంటాలు పడుతూ, పిల్లలను చేర్చేందుకు బతిమిలాడే పరిస్థితులు ఉండేవి. అయితే, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలతో సంక్షేమ వసతి గృహాలు కార్పొరేట్ హాస్టళ్లను తలదన్నేలా మారాయి. నిర్దేశించిన మెనూ మేరకు పౌష్టికాహారం అందిస్తుండడంతో పాటు వసతి గదులు, స్టడీ రూమ్లు, స్నానపు గదులు కోట్లాది రూపాయలు వెచ్చించి పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. విద్యార్థుల ఇండ్లను మైమరిపించేలా సేవలందిస్తూ, ప్రత్యేక తరగతుల నిర్వహణ, సబ్జెక్ట్ నిపుణులతో తమ తరగతుల్లో వచ్చే సందేహాలను నివృత్తి చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థులు ప్రైవేట్ బాట వీడి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా రెండేళ్ల నుంచి ప్రభుత్వ హాస్టళ్లలో సీట్లు దొరకడం కష్టసాధ్యంగా మారిందనే అభిప్రాయాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
హాస్టళ్లలో పక్కాగా అమలవుతున్న మెనూ
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. వీటిలో వసతులు పొందుతున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా నిధులు విడుదల చేస్తుండగా, సంక్షేమ శాఖల అధికారులు రెండేళ్ల క్రితం నుంచి మార్చిన మెనూను పక్కాగా అమలు చేస్తున్నారు. సక్రమంగా చదువుకోవాలంటే కడుపునిండా భోజనం, కంటి నిండా నిద్ర ఉండాలనే నానుడికి అనుగుణంగా పెంచిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం నిర్దేశించిన మేరకు అందుతోంది. అలాగే, విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాల పంపిణీతో పాటు పోస్ట్ మెట్రిక్ విభాగంలో వివిధ వృత్తి విద్య కోర్సులు అభ్యసించే వారి కోసం ప్రత్యేకంగా హాస్టళ్లలోనే గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేశారు. అవసరం మేరకు గెస్ట్ లెక్చరర్లను నియమించి ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తుండడంతో, ఏయేటి కాయేడు హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మూడేళ్ల క్రితం వరకు హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉండగా, మెరుగైన సౌకర్యాల కల్పనతో గతేడాది నుంచి వసతి గృహాల్లో చేరేందుకు పోటీపడుతున్నారు.
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 31 ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు కొనసాగుతుండగా, గత విద్యా సంవత్సరంలో 2542 మంది విద్యార్థులు వసతి పొందారు. షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాలుగు ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు నిర్వహిస్తుండగా 464 విద్యార్థులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించి 19 పాఠశాల, కళాశాల స్థాయి వసతి గృహాల నిర్వహణ కొనసాగుతుండగా 1545 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లావ్యాప్తంగా కేవలం 2వేల మందికి కూడా ప్రభుత్వ హాస్టళ్లలో ప్రవేశాలు లభించకపోయేది. స్వరాష్ట్రంలో మారిన సౌకర్యాల నేపథ్యంలో గతేడాది నుంచి విద్యా సంవత్సరం ఆరంభంలోనే హాస్టళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. మైనార్టీ, మహాత్మాజ్యోతిబా ఫూలే, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో రెసిడెన్షియల్ విధానం కొనసాగుతుండగా కూడా సంక్షేమ వసతి గృహాల వైపు విద్యార్థులు పరుగులు తీస్తుండడంపై పెరిగిన వసతి సౌకర్యాల తీరు స్పష్టమవుతోందని ఆయా సంక్షేమ శాఖల అధికారులు పేర్కొంటున్నారు.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి
హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతులపై కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్వయంగా హాస్టళ్లను సందర్శిస్తున్నారు. విద్యార్థుల చేరికపై అధికారులను ఆరా తీస్తున్నారు. ఇటీవల నిర్వహించిన బడిబాటలో పాల్గొని పిల్లలను హాస్టళ్లలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. వసతి గృహాల్లో పిల్లలకు అందుతున్న సౌకర్యాల గురించి వివరిస్తున్నారు. దీంతో గతేడాదితో పోల్చితే ఈసారి హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ఆయా సంక్షేమ శాఖల అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై పక్షం రోజులు కూడా గడవకముందే కొత్తగా చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.