జమ్మికుంట, జనవరి 30: బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి సభను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేటి మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు సాగుతున్న బీఆర్ఎస్కు మాత్రమే ఓట్లడిగే నైతిక హక్కు ఉన్నదని స్పష్టం చేశారు. రైతుబంధు, దళితబంధు లాంటి రెండు గొప్ప పథకాలకు సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. హుజూరాబాద్ బీఆర్ఎస్కు అడ్డా అని, ప్రజలంతా తమవైపే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సోమవారం సీపీ ఎల్ సుబ్బారాయుడు, ఎమ్మెల్సీలు పాడి కౌ శిక్రెడ్డి, నారదాసు, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేటీఆర్ పర్యటన వివరాలు వెల్లడించారు.
హుజూరాబాద్ గడ్డకు కేటీఆర్ మొదటిసారి వస్తున్నారని, ఆయన స్పీచ్ వినేందుకు ప్రజలంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో సెంటిమెంట్ను సాకుగా చూపి ఈటల గెలిచాడని, ఇప్పుడా పరిస్థితుల్లేవన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎవరితో సాధ్యమవుతుందనే విషయాన్ని ఇక్కడి ప్రజలు గుర్తించారని చెప్పారు. ఎంపీగా బండి, ఎమ్మెల్యేగా ఈటల గెలిచిన తర్వాత కేంద్రం నుంచి ఒక్క రూపాయైనా తెచ్చారా..? అభివృద్ధి కోసం తట్టెడు మైట్టెనా పోశారా..? అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి ఇక్కడ కుంటుపడిందని, బీఆర్ఎస్ గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పారు. అభివృద్ధి కోసం పాటుపడని నాయకులు అవసరం లేదని ఇక్కడి ప్రజలంతా కృతనిశ్చయంతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.