ధర్మపురి, అక్టోబర్ 8: స్వరాష్ట్రంలోనే పేదల సొంతింటి కలను సాకారం చేశామని, ఆత్మగౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్లో రూ.1.90కోట్లతో నిర్మించిన 39 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. బుగ్గారం మండలం సందయ్యపల్లి, చిన్నాపూర్, బుగ్గారం, మద్దునూర్ గ్రామాల్లో రూ.16.10కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. సొంత స్థలం లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. స్థలం ఉన్నవారు ఇండ్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద సాయాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఉద్ఘాటించారు. సమైక్య ప్రభుత్వాల పాలనలో పల్లెలు చీకట్లో మగ్గాయని, స్వరాష్ట్రంలో ప్రభుత్వం చర్యలతో కొత్త రూపు సంతరించుకున్నాయని చెప్పారు. పల్లెప్రగతి ద్వారా పచ్చదనం, పరిశుభ్రతతో మెరిసిపోతున్నాయన్నారు.
కాగా, సందయ్యపల్లిలో రూ.10లక్షలతో నిర్మించనున్న జీపీ భవనానికి శంకుస్థాపన చేశారు. చిన్నాపూర్లో రూ.2కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు, రూ.10లక్షలతో సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. అనంతరం బుగ్గారంలో రూ.8కోట్లతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డబుల్రోడ్డు, డివైడర్లు, సంఘ భవనాలు, రూ.5కోట్లతో సీసీ రోడ్లు, మురుగుకాలువలు, కుల సంఘభవనాలను ప్రారంభించారు. మద్దుపూర్లో రూ. కోటితో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగుకాలువలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాధినేని రాజమణి, జడ్పీటీసీ బాధినేని రాజేందర్, వైస్ ఎంపీపీ సుచేందర్, మండలాధ్యక్షుడు గాలిపెల్లి మహేశ్, మండల కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, మండల ఆర్బీఎస్ కన్వీనర్ సత్యనారాయణరావ్, ఆయా గ్రామాల సర్పంచులు ఉన్నారు.