కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 11 : మున్సిపోల్స్లో కీలక ఘట్టం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. బుధవారం రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ జరిగింది. మొత్తం 1,586 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయగా.. పట్టణ ఓటర్లు ఓటోత్సాహం చూపారు. ఉదయం 9గంటల వరకు కొంత మందకొడిగా కొనసాగినా.. ఆ తర్వాతి నుంచి పోటెత్తారు. మధ్యాహ్నం కాస్త తగ్గినా.. సాయంత్రం నాలుగు గంటల నుంచి బారులు తీరారు.
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఏకగ్రీవమైన ఒక వార్డు ఓటర్లు పోను మొత్తం 10,27,584 మంది ఓటర్లకు 7,15,468 మంది (69.62శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో స్వల్ప గొడవలు, పోలీసుల యాక్షన్, లాఠీచార్జి మినహా అంతటా ఓటింగ్ ప్రశాంతంగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను అధికారులు భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్రూంలకు తరలించారు. శుక్రవారం ఓట్లు లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడించనుండగా, అభ్యర్థులు అప్పుడే అంచనాల్లో మునిగిపోయారు. మరో 24గంటల పాటు టెన్షన్ ఉండగా, అనుచరులతో కలిసి బూత్ల వారీగా లెక్కలు వేస్తున్నారు. ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నడూ లేనంతగా డబ్బుల ప్రవాహం
నా రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికలను చూడలేదు. ఎప్పుడూ చూడని విధంగా డబ్బుల ప్రవాహం సాగింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం, ప్రచారాలకు పెడుతున్న ధనం చూస్తుంటే భయం వేస్తున్నది. అక్రమంగా డబ్బులు సంపాదిస్తం, ఎన్నికల్లో ఖర్చుపెడుతం అన్నట్టు చేస్తున్నరు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంత ఖర్చు పెట్టి పోటీ చేస్తున్న నాయకులు గెలిచి ఏం చేస్తరు? ఇంత డబ్బుల ప్రవాహం చూస్తే తీవ్రంగా బాధ కలుగుతున్నది. కరీంనగర్ చరిత్రలో బీఆర్ఎస్ హయాంలో తప్ప ఇప్పటి వరకు సింగిల్ పార్టీ మేయర్ పదవిని కైవసం చేసుకోలేదు. ఈ ఎన్నికల్లోనూ హంగ్ ఫలితాలే వస్తాయని అంచనా వేస్తున్నం. నగర ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నమ్మకం లేకుండా పోయింది. సామాన్య ప్రజలు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. డబ్బులే రాజకీయాలు నడిపిస్తున్నాయన్న అన్నట్టు ఉన్నది. అభివృద్ధి చేసే పార్టీలకు ఓటు వేస్తారని మేం ఆశిస్తున్నం.
– నగరంలోని 52వ డివిజన్లోని ట్రినిటీ బాలికల జూనియర్ కళాశాలలో ఓటు వేసిన అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్

ఓటు హక్కు స్ఫూర్తి
వేములవాడ/ హుజూరాబాద్/ మెట్పల్లి/ మెట్పల్లి టౌన్/ జమ్మికుంట, ఫిబ్రవరి 11: ప్రజాస్వామ్యం కీలమైనది ఓటు హక్కు! ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెబుతున్నా.. కొందరు గడపదాటడం లేదు! తమ బద్ధకాన్ని వీడడం లేదు. కానీ, కొందరు మాత్రం ప్రతికూల పరిస్థితుల్లో ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. వేములవాడకు చెందిన ప్రతాప కార్తికేయ అమెరికా నుంచి వచ్చి, 28 వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డుకు చెందిన రామ రాజమ్మ ఆక్సిజన్ సిలిండర్ వెంటపెట్టుకొని ఆటోలో పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఉత్సాహంగా ఓటు వేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన (వెంకట్రావుపేట) ఆడెపు సరస్వతి (88), అంబులెన్స్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 18వ వార్డుకు చెందిన ఎండి ఇస్మాయిల్, తన తల్లి చనిపోయిన బాధను దిగమించుకొని రాజ్యాంగం కల్పించిన ఓటు హకును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఓటు వేశారు.
స్థానిక సంస్థలకు నేరుగా నిధులు రావాలి
స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇచ్చేలా ప్రభుత్వంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. స్థానికంగా అభివృద్ధి జరగాలంటే జీఎస్టీ, ఇతర పనుల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా స్థానిక సంస్థల ఖాతాలకు రావాలి. అప్పుడే అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తే తప్ప ముందుకు సాగని పరిస్థితి ఉన్నది. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి చేసి చూపించి పార్టీలను గెలిపించాలి. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకు ఓటు వేయాలి.
– నగరంలోని దన్గర్వాడీ ప్రాథమిక స్కూల్లో ఓటు వేసిన అనంతరం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్
