తెలంగాణ రైతులంటేనే చిన్నచూపు చూస్తున్న కేంద్రంపై టీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. ‘వన్నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్’ పేరిట ఆహార ధాన్యాల సేకరణలో దేశమంతటా ఒకే పాలసీ ఉండాలన్న నినాదంతో గ్రామ స్థాయి నుంచే దండయాత్ర మొదలుపెడుతున్నది. ధాన్యం కొనాల్సిందేనంటూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లెలు కదిలాయి. మోదీ సర్కారు వైఖరికి నిరసనగా శుక్రవారం పంచాయతీ పాలకవర్గాలు సమావేశమై, ఏకగ్రీవ తీర్మానం చేశాయి. తెలంగాణపై వివక్ష సరికాదని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తీరు మారకపోతే..తగిన బుద్ధి చెబుతామంటూ రైతులు హెచ్చరించారు.
కరీంనగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం కొనుగోలు కోసం మరో పోరాట మొదలైంది. కేంద్రం వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో ఉధృతమవుతున్నది. దశలవారీగా గ్రామ స్థాయి నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, ఇదే సమయంలో ప్రజలు, రైతులకు వాస్తవాలు తెలియజేయాలని సీఎం ఆదేశించగా, వారంపాటు కార్యక్రమాలు చేపట్టేందుకు టీఆర్ఎస్ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. అందులో భాగంగా ఈనెల 24 నుంచి 31 వరకు ఏ రోజు ఏ కార్యక్రమాన్ని చేపట్టాలో ఇప్పటికే పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు గురువారమే (ఈ నెల 24న) అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సన్నాహక సమావేశాలు విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే రైతు ఉద్యమానికి సిద్ధం కావాలని, తీర్మానాలతో కేంద్రంపై ఒత్తిడి తేవాలని, రైతుల ఇండ్లపై నల్లజెండా ఎగురవేయాలని, రైతులను కూడా జాగృతం చేసి భాగస్వాములను చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రైతు వ్యతిరేక మోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతోపాటు కండ్ల ముందు కేంద్రం పెడుతున్న కొర్రీలు.. తద్వారా ఏర్పడబోయే ఇబ్బందుల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీలతో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని బరాబర్ కొనాలంటూ.. సీఎం కేసీఆర్ కేంద్రం ముందు పెట్టిన డిమాండ్కు పూర్తి మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పల్లెలన్నీ కలిసి కట్టుగా కదిలాయి. వంద శాతం ధాన్యం కొనసాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించాయి. సీఎం ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీ పాలకవర్గాలు.. శుక్రవారం ఉదయం నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మెజార్టీ చోట్ల పాలకవర్గాలు సమావేశమయ్యాయి. రైతును రాజును చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, అన్నదాతల సంక్షేమం, రైతుబంధు, 24గంటల కరెంట్ పథకాలు, కాళేశ్వరంతో తీరిన నీటిగోస, పెరిగిన సాగు వీస్తీర్ణం, ధాన్యం దిగుబడులు.. ఈ పరిస్థితుల్లో వడ్లు కొనకుండా ఏడాది కాలంగా కేంద్రం తెలంగాణ రైతులపై చూపుతున్న వివక్ష.. ఒక్క యాసంగే కాదు, భవిష్యత్లో ఏర్పడబోయే పరిణామాల వంటి అనేక అంశాలపై చర్చించుకుంటూనే.. ఎక్కడికక్కడ తీర్మానాలు చేశాయి. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్లో 313, జగిత్యాలలో 380, పెద్దపల్లిలో 266, రాజన్న సిరిసిల్లలో 255 పంచాయతీలున్నాయి. మొత్తం 1214 ఉండగా వందశాతం జీపీలు తీర్మానాలు పూర్తి చేశాయి.
ఈ నెల 24న సన్నాహక సమావేశాలు నిర్వహించగా, 25న పంచాయతీ తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమాలను చేపట్టనున్నారు. 26న ఎంపీపీలు, ఎంపీటీసీలు కేంద్ర ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలకు నిరసనగా తీర్మానాలు చేయనున్నారు. 27న జిల్లా, మండల స్థాయి రైతుబం ధు సమితి కమిటీలు, 28న మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 29న డీసీసీబీ, డీసీఎంస్ చైర్మన్లు, డైరెక్టర్లు, 30న జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, 31న మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు తీర్మానాలు చేయనున్నారు. ప్రతులను ఒకేసారి మోదీకి చేరేలా కొరియర్, పోస్టు ద్వారా పంపించనున్నారు.