కోనరావుపేట, మే 3: అకాల వర్షాల వల్ల తడిసిన ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల కల్లాలు తిరుగుతూ తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, వారితో మాట్లాడారు.
ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. పంట చేలో తడిసి ముద్దయి, రాలిపోయి నష్టపోయిన రైతులకు ఎకరాన రూ.10 వేల నష్టపరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని చెప్పారు. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని తూకం వేసి కొంతమేర మిల్లులకు తరిలిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని రాజకీయం చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక్కడ రాష్ట్ర పశుగాణాభివృద్ధి సంస్థ చైర్మన్, కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు ఉన్నారు.