వేములవాడ టౌన్, ఫిబ్రవరి 12: సమ్మక్క జాతరకు ముందు తొలిమొక్కు కోసం తరలివచ్చిన భక్తులతో సోమవారం వేములవాడ రాజన్న ఆలయం పోటెత్తింది. సుమారు లక్ష మంది రావడంతో ప్రాంగణం జాతరను తలపించింది. క్షేత్రానికి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. రాష్ట్ర నలుమూలల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
రాయేశుడికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. ఎత్తు బంగారం (బెల్లం) జోకించి పంచిపెట్టారు. సుమారు లక్ష మంది స్వామివారిని దర్శించుకోగా సుమారు రూ. 34 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. సర్వ దర్శనానికి సుమారు 4 గంటలకు పైగా పట్టిందని పేర్కొన్నారు.