వేములవాడ రూరల్, జనవరి 13: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ మండలం చింతల్ఠాణా, ఆరెపల్లిలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవావాలు తెలిపారు.
ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని, గతంలో పోరాటం చేశామని గుర్తుచేశారు. ఇక్కడి సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్నదని, తప్పకుండా ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటామన్నారు. మీ దయతో ఎన్నికల్లో గెలిచానని, ఈ పదవీని ప్రజలకు అంకితం చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని తెలిపారు. కాగా ప్రభుత్వవిప్ను ఘనంగా సన్మానించారు.
రుద్రవరంలో ముదిరాజ్ మత్స్యకార సం ఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెప్పెల పోటీలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిడ్మానేరులో తెప్పెల పోటీలు నిర్వహించడంపై సం తోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కనుకయ్య, సర్పంచులు రాంరెడ్డి, నవీనరాజు, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణదేవరావు ఉన్నారు.