chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 16 : ‘గ్రామంలో 10 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్, ఆయా లేక బడి పూర్తిగా మూతబడిందని, వెంటనే భర్తీ చేయాలని, లేకుంటే జూన్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపడతా’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లంబాడిపల్లి సర్పంచ్ కాటం సంపత్ రెడ్డి అధికారులు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. చిగురుమామిడి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా చేపట్టిన ప్రగతిని శాఖల వారీగా సమావేశంలో గ్రామ ప్రత్యేక అధికారులు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) జగదీశ్వర్ ఎదుట వివరించారు.
ప్రధానంగా గ్రామాల్లో రైతు భరోసా అందజేయాలని, వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని పలువురు సర్పంచులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పింఛన్లు, కల్యాణ లక్ష్మి, మహిళా శక్తి, బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డులు, పారిశుద్ధ పనులు పై చేపట్టిన ప్రగతిని సమావేశంలో ప్రత్యేక అధికారులు వివరించారు. ఈ ప్రగతి ప్రణాళికలో నూతనంగా ఆల్పాహార పథకం, కుటుంబ జీవిత బీమా, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం, వికలాంగులకు వాహనాలు, పంటల మార్పిడీ, సేంద్రియ వ్యవసాయం, మొదలు వాటిపై ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీపీవో జగదీశ్వర్ హాజరై మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని, స్థానిక సమస్యలకు అభివృద్ధికి ప్రాధాన్య కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్ కుమార్, వివిధ శాఖల మండల అధికారులు జ్ఞానేశ్వరి, విజయలక్ష్మి, జయప్రద, పున్నం చందర్, రాకేష్, నిరంజన్ రెడ్డి, ప్రకాష్, ఇర్షత్ సుల్తానా, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మార్క రాజ్ కుమార్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.