తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు పండుగలా సాగాయి. అన్ని పట్టణాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. పారిశుధ్య కార్మికులు, సిబ్బందితో బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్ల మధ్య భారీ ర్యాలీలు తీశారు. రోడ్లపై మున్సిపల్ వాహనాలతో ప్రదర్శన చేపట్టారు. ప్రధాన కూడళ్లలో మానవహారాలతో హోరెత్తించారు. అనంతరం జరిగిన సమావేశాల్లో పట్టణ ప్రగతి సాధించిన అభివృద్ధిని నివేదించారు. ఉత్తమ ఉద్యోగులు, కార్మికులకు ప్రశంసా పత్రాలు అందించి, ఘనంగా సత్కరించారు. చిరువ్యాపారులకు రుణ మంజూరు చెక్కులు అందించారు. కాగా, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొనగా, చొప్పదండిలో వినోద్కుమార్తో పాటు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, హుజూరాబాద్, జమ్మికుంటలో మండలి విప్ కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరై వేడుకలను ప్రారంభించారు.
– కరీంనగర్, జూన్ 16(నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 16(నమస్తే తెలంగాణ) : పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు జిల్లాలోని అన్ని పట్టణాల్లో అంబరాన్నంటాయి. ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కనిపించింది. ముందుగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి బతుకమ్ము, బోనాలు, ఒగ్గుడోలు విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీలు తీశారు. ప్రధాన కూడళ్లు, మైదానాల్లో మానవహారాలు ఏర్పాటు చేశారు. పారిశుధ్య, నీటి సరఫరా, ఇతర విభాగాల్లోని వాహనాలను ఒకచోట చేర్చి, ఆయా పట్టణాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో పట్టణ ప్రగతి ద్వారా సాధించిన అభివృద్ధిపై నివేదికను అధికారులు, ప్రజాప్రతినిధులు చదివి వినిపించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి, ఘనంగా సన్మానించారు. తర్వాత పట్టణాల్లోని చిరువ్యాపారులకు రుణ మంజూరు చెక్కులు అందించారు. సమావేశం అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. కాగా, కరీంనగర్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు.
ముందుగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్టేడియం నుంచి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల వాహనాల ర్యాలీని మంత్రి గంగుల, వినోద్కుమార్ జెండాఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ అంబేద్కర్ స్టేడియం నుంచి కలెక్టరేట్, తెలంగాణ చౌక్, కోర్టు చౌరస్తా మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు సాగింది. అలాగే, నగరపాలక సంస్థ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి కార్యాలయం నుంచి పద్మనాయక కల్యాణ మంటపం వరకు ర్యాలీ తీశారు. తర్వాత పారిశుద్య సిబ్బందిని సన్మానించారు. వీధివ్యాపారులు 6214 మందికి సంబంధించి రూ.12.42 కోట్ల చెక్కును అందించారు. మండలి విప్ కౌశిక్రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ సునీల్రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు. చొప్పదండిలో జరిగిన వేడుకలకు బోయినపల్లి వినోద్కుమార్తో పాటు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. ముందుగా పలు వార్డుల్లో వినోద్ పర్యటించి సెంట్రల్ లైటింగ్ పనులు, వ్యవసాయ మార్కెట్లో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించారు.
అంతకు ముందు పట్టణానికి వచ్చిన వినోద్కుమార్, రవిశంకర్లను మహిళలు బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు చప్పుళ్లతో ఘనంగా ఎదుర్కొని ర్యాలీ తీశారు. హుజూరాబాద్ పట్టణంలో జరిగిన వేడుకల్లో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ముందుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు ర్యాలీ తీశారు. జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మండలి విప్తో పాటు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. ముందుగా తెలంగాణ చౌక్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. గాంధీ చౌక్ నుంచి పాత మున్సిపల్ వరకు ర్యాలీగా తీశారు. అనంతరం ఉత్తమ అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు పాల్గొన్నారు. కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డంపింగ్ యార్డ్ వద్ద డీఆర్సీసీ షెడ్ను ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు, పట్టణ ప్రజలు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది ర్యాలీ తీసి, అంగడి బజార్లో మానవహారంగా ఏర్పడ్డారు.