Adluri Laxman Kumar | ధర్మారం, మే 18: వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ధాన్యం కొనుగోలు తీరు, రైతులకు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతున్న పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటుందని, కానీ ధాన్యం కొనుగోళ్లను మాత్రం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం గడచిన మూడు పంటల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి సేకరించి మిల్లర్ల వద్ద నిల్వ చేసిందని మంత్రి వివరించారు. ఎఫ్ సి ఐ ద్వారా బియ్యం సేకరణ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచి బియ్యం సేకరించక పోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైస్ మిల్లులో పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు పేరుకు పోయాయని మంత్రి తెలిపారు.
రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలోని పరిస్థితిని వివరించి ఎఫ్ సి ఐ ద్వారా బియ్యం సేకరణ చేయించాల్సిన విషయం మరిచి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. దేశ ప్రధాని ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఏమి మాట్లాడలేదని మంత్రి ఆరోపించారు. బాధ్యతగా రైతుల వద్ద నుండి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరిస్తుండగా బాధ్యత లేని బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. మంత్రి వెంట పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రూప్ల నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, డైరెక్టర్ గంధం మహిపాల్ నాయకులు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.