వెల్గటూర్, మే 21: సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో సంగ రమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలు, కుల సంఘాల నాయకులు 200 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు గ్రామానికి వచ్చిన మంత్రికి మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలుకగా, మంత్రి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామ ఫౌండర్ ఏలేటి రాజారాంరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నాటి కాంగ్రెస్ 40 ఏండ్ల పాలనలో పల్లెలన్నీ దుమ్మూధూళితో అధ్వానంగా ఉండేవని, ఆ పరిస్థితిని మనం కండ్లారా చూశామని గుర్తు చేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల రూపురేఖలు మార్చారన్నారు. దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా 20 గ్రామాలు ఎంపికైతే అందులో మన తెలంగాణ నుంచే 19 ఉండడం మన పనితీరుకు కొలమానం అని చెప్పారు. విద్యా, వైద్యంలో ఊహించని ప్రగతి సాధించామని, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఇంత అభివృద్ధిని చూసి నేడు బీఆర్ఎస్లోకి యువత పెద్ద సంఖ్యలో రావడం శుభ పరిణామమన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్న మంత్రి, ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని సూచించారు.
నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద 26 వేల కుటుంబాలకు సాయం అందించి రాష్ట్రంలోనే ముందున్నామని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో రాజన్నల సంఘం భవనానికి రూ.10 లక్షలు, మహిళ సంఘ భవనానికి రూ.5 లక్షలు, యాదవ సం ఘ భవనాల నిర్మాణాలకు ప్రొసీడింగ్స్ అందజేశారు. పార్టీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు మొగిళి జంపయ్య, సీనియర్ నాయకులు ఏవీ ఎం సతీశ్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు మ్యాకల సంతోశ్, నాయకురాలు ఇందూరి లింగమ్మ, గౌడ సంఘం నాయకులు తోడేటి సతీశ్, కురు మ సంఘం ఒగ్గు కళాకారుల అధ్యక్షుడు కంబా ల చందు, నేతకాని, రాజన్నల, యాదవ సంఘా ల నాయకులు దుర్గం సంతోశ్, మేరుగు జాని, ఉప్పునూరి రవి, ఇతర నాయకులు చేరారు. ఇక్కడ పార్టీ సీనియర్ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, ఏలేటి కృష్ణారెడ్డి, మారం జలేందర్రెడ్డి, గూడ రాంరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు రెడ్ల కృష్ణ, బాబురావు, రమేశ్ పాల్గొన్నారు.