కార్పొరేషన్, మార్చి 22: వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 24న టీఆర్ఎస్ కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సుడా చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మంత్రి గంగుల మీసేవ కార్యాలయంలో మంగళవారం ఆయన మేయర్ వై సునీల్రావుతో కలిసి టీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, ఆర్బీఎస్ కో-ఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, జడ్పీటీసీలు పురుమల్ల లలిత-శ్రీనివాస్, పిట్టల కరుణ-రవీందర్, ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలత-మహేశ్, టీఆర్ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, సుంకిశాల సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.