వర్ష బాధితులకు ప్రజాప్రతినిధుల భరోసా
ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
దెబ్బతిన్న ఇండ్లు పరిశీలన.. నష్టంపై ఆరా
అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు
ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ
కరీంనగర్లో కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
వర్ష బాధితులకు ఎమ్మెల్యేలు, అధికారులు భరోసానిస్తున్నారు. ఎడతెరిపిలేని వానలతో చాలా చోట్ల ఇండ్లు దెబ్బతినగా, ‘అధైర్యపడొద్దు.. అండగా మేమున్నాం’ అంటూ ధైర్యమిస్తున్నారు. సోమవారం తమ నియోజకవర్గాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి.. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రామగుండం.. ఎమ్మెల్యే సంజయ్ బీర్పూర్ మండలం.. సుంకె రవిశంకర్ గంగాధర మండలం పిట్టలపల్లిలో పర్యటించి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు, నష్టం అంచనా వేసే పనిలో తలమునకలయ్యారు.
కరీంనగర్, జూలై 11(నమస్తే తెలంగాణ): గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్ ఆరంభంలోనే వర్షాలు దంచికొడుతున్నాయి. మూడు రోజులుగా తెరిపిలేకుండా విజృంభించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల పాత ఇండ్లు కూలిపోగా, ఇంకొన్ని ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరి అల్లాడిపోయారు. ఈ క్రమంలో స్పందించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అభయమిస్తున్నారు. ‘మేమున్నాం.. మేకేం కాదని’ భరోసా కల్పిస్తున్నారు. సోమవారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రామగుండం 2,3 డివిజన్లో పర్యటించారు. 3వడివిజన్లో 30 కుటుంబాలకు 20 కిలోల చొప్పున బియ్యాన్ని అందజేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం వెంకంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టలపల్లిలో కూలిపోయిన పిట్టల మహేశ్ ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీర్పూర్ మండలంలో పర్యటింటారు. నాయకపు గూడెంలో దెబ్బతిన్న గుడిసెలను పరిశీలించి, ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బీర్పూర్లో ఇల్లు కూలిపోయిన బాధితుడికి ఆర్థిక సాయం చేశారు. అలాగే కమ్మునూర్-కలమడుగు వంతెన వద్ద గోదావరి వరద ప్రవాహన్ని పరిశీలించారు. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి పంచాయతీ ఎదుట రోడ్డు జలమయం కాగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులను ఆదేశించారు. మంథని ఎరుకలగూడెంను మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సందర్శించి, కాలనీ వాసులతో మాట్లాడారు.
సారంగాపూర్: బీర్పూర్లో కూలిన ఇంటిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్
అండగా అధికారులు..
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్ట ప్రాంతాలను పరిశీలిస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దెబ్బతిన్న, కూలిన ఇండ్లు, విద్యుత్ స్తంభాలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేస్తున్నారు. జగిత్యాల కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ ధర్మపురి, రాయపట్నం వద్ద గోదావరి నది ఉధృతిని పరిశీలించారు. అలాగే నాయకపు గూడెంలో వర్షాలకు గుడిసెలు దెబ్బతినగా, అందులో ఉంటున్న పలు కుటుంబాలను ఎమ్మెల్యే సంజయ్ ఆదేశాలతో ఆదివారం రాత్రి వారిని అధికారులు, ప్రజాప్రతినిధులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పీఎస్ శ్రీనివాస్, పీఎ గన్రాజుతో కలిసి సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ కొత్త చెరువు, ప్రధాన కాలువ, బైపాస్ రోడ్డుతో పాటు ముంపు ప్రాంతాలను పరిశీలించారు.