వర్ష బీభత్సంతో జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ఈ పరిస్థితుల్లో ‘మేమున్నా’మంటూ జిల్లా ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్ అధ్యక్షులు, స్థానిక నేతల వరకు వారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలతో మమేకమవుతున్నారు. అధికారులను అనుక్షణం అప్రమత్తం చేస్తూనే.. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు సహాయక చర్యలను వేగవంతం చేస్తూ.. వరదలతో ఎక్కడ సమస్య తలెత్తితే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వర్ష బాధితులకు భరోసానిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ.. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
కరీంనగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గడిచిన ఆరు రోజులుగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ భరోసానిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ.. అవసరమైన సూచలు, సలహాలు అందిస్తూ.. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అవసరమైన చోట పునరావాస సౌకర్యాలు కల్పిస్తూ బాధితులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. నిత్యం ప్రజలే ప్రాణంగా.. వారితోనే మమేకమవుతూ.. నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పూర్వ జిల్లా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు సమాచారమిస్తూ.. వారి ఆదేశాల ప్రకారం ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, మంత్రి గంగుల కమలాకర్ క్షేత్రస్థాయిలో ఉండగా, మంత్రి కేటీఆర్ ఆరంభం నుంచి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం సిరిసిల్లలో పర్యటించి పరిస్థితులపై పూర్తిగా సమీక్షించి.. అవసరమైన సూచనలు సలహాలు చేశారు. అలాగే మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ అధికారులను అప్రమత్తం చేస్తూ.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు స్థానికంగా లేకపోయినప్పటికీ పరిస్థితులను తెలుసుకుంటూ.. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వీరితోపాటు ఎమ్మెల్సీలు, జడ్పీ అధ్యక్షులు, కార్పొరేషన్, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులంతా బాధితులకు బాసటగా నిలిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో పరిస్థితులు ప్రశాంతంగానే ఉండగా, భారీ వర్షాలు కురుస్తున్నా ముందుస్తు అప్రమత్తత వల్ల ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
ఆది నుంచే అప్రమత్తం చేస్తూ..
సిరిసిల్ల జిల్లా పరిస్థితిపై మంత్రి కేటీఆర్ ఆరా
వానకాలం సీజన్ ప్రారంభంలోనే సిరిసిల్ల జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ అప్రమత్తం చేశారు. గత పరిస్థితులు పునరావృతం కావొద్దన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. ముందు జాగ్రత్తగా ఆర్డీఎఫ్ బృందాన్ని పంపించారు. వారం క్రితం వాన మొదలైనప్పటి నుంచి జిల్లా పరిస్థితిపై రోజువారీగా ఆరా తీస్తున్నారు. జిల్లాలో పడుతున్న వర్షాలు, చేపడుతున్న చర్యలపై అధికారులతో నిత్యం సమీక్షిస్తున్నారు. ఈ నెల 11న (సోమవారం) కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి, వరద పరిస్థితిని తెలుసుకున్నారు. అధికారులంతా అందుబాటులో ఉండి, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్, ఆరోగ్యశాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టులు, చెరువులు, చెక్డ్యాంల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎగువ మానేరు, శ్రీరాజరాజేశ్వర, అన్నపూర్ణ ప్రాజెక్టుల వద్ద నిఘా ఉంచాలని, మానేరు, మూలవాగులతోపాటు ప్రతి మండలంలోని చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలని సూచించారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటుండగా, మంత్రి కేటీఆర్ గురువారం జిల్లాలో ఆకస్మిక పర్యటన చేశారు. సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్, ఇన్చార్జి ఎస్పీ సింధూశర్మ, అన్ని శాఖల అధికారులతో వర్షాలపై రెండు గంటల పాటు సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం ఉండద్దన్నారు. అధైర్య పడవద్దని అండగా నేనున్నానంటూ జిల్లా ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావద్దని, తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
– రాజన్న సిరిసిల్ల, జూలై 14 (నమస్తే తెలంగాణ)
ప్రతి రోజూ ప్రజల్లోనే..
విస్తృతంగా పర్యటిస్తున్న రసమయి బాలకిషన్
భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతి రోజూ ఉదయమే గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెక్కులు అందిస్తూనే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితం తిమ్మాపూర్ మండలం నేదునూర్లోని గోసంగికాలనీని కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి సందర్శించారు. అక్కడ దెబ్బతిన్న ఇండ్లలో ఉంటున్న దళితుల పరిస్థితిని కలెక్టర్కు చూపిస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని విన్నవించడంతో వర్షాలు తగ్గే వరకు స్థానిక పాఠశాలను పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం ఇక్కడి 20 కుటుంబాలను పాఠశాలకు తరలించి భోజనాలు ఏర్పాటు చేశారు. రెండు రోజుల కింద మానకొండూర్ కట్టకు బుంగ పడిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఇలా ప్రతి రోజూ జనంలోనే ఉంటున్న ఎమ్మెల్యే వర్షాల ప్రభావంపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరిగినా చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను ఆదేశిస్తున్నారు.
–కరీంనగర్, జూలై 14(నమస్తే తెలంగాణ)
అన్నీ తానై.. అండగా ఉంటూ..
ధైర్యం కల్పిస్తున్న మంత్రి కొప్పుల
వరద బాధితులకు అన్నింటా తానై అండగా ఉంటున్నారు రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. భారీ వర్షాలు ప్రారంభమైన మరుక్షణం నుంచి రంగంలోకి దిగి ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తూ మార్గదర్శనం చేస్తున్నారు. మంగళవారం ధర్మపురిలో అధికారులతో సమీక్షించారు. అదే రోజు రాయికల్ మండలం బోర్నపల్లి సమీపంలోని గోదావరినది మధ్యలో ఉన్న కుర్రులో 9 మంది కౌలు రైతులు చిక్కుకోగా సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్కుమార్ దృష్టికి తీసుకువెళ్లి వారిని క్షేమంగా రప్పించారు. బుధవారం ఉదయం ధర్మపురిలోకి గోదావరి నీరు ప్రవేశించిందన్న సమాచారంతో పట్టణంలోని అన్ని వీధుల్లో కలియదిరిగి ప్రజలకు భరోసా ఇచ్చారు. బోయవాడతో పాటు, పలు కాలనీలకు చెందిన వారికి ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో తాత్కాలిక వసతి సౌకర్యం కల్పించి, భోజన ఏర్పాట్లు చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్తో కలిసి ఎన్టీవీ రిపోర్టర్ గల్లంతైన భూపతిపూర్ వాగు వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. రాత్రి జగిత్యాలలోనే బస చేసి, గురువారం ఉదయం గల్లంతైన విలేకరి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఉదయం 10 గంటలకు మరోసారి భూపతిపూర్ వాగు వద్దకు వెళ్లి విలేకరి ఆచూకీ కోసం ఆరా తీశారు. మధ్యాహ్నం కలెక్టరేట్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న ఇండ్ల యజమానులను కలిసి ధైర్యం చెప్పారు.
– జగిత్యాల, జూలై 14(నమస్తే తెలంగాణ)
జోరువానలో భరోసా నింపుతూ..
నేనున్నానంటూ ఎమ్మెల్యే కల్వకుంట్ల
జోరువానలో సైతం ప్రజలకు అందుబాటులో ఉంటూ ‘నేనున్నా’ అంటూ భరోసా నింపుతున్నారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు. కోరుట్ల పట్టణంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రకాశ్నగర్, అంబేద్కర్నగర్, ఝాన్సీ నగర్లో పర్యటించి, ప్రజలకు భరోసా ఇచ్చారు. సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లోతట్టు, వాగు పరీవాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, అవసరమైన వసతులు, భోజన సౌకర్యం కల్పిస్తామని భరోసానిచ్చారు. స్థానిక సాయిబాబా దేవాలయంతో పాటు కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్, ప్రార్థనా మందిరంలో ఆశ్రయం కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని అభయమిచ్చారు. గురువారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఎర్దండి గ్రామాన్ని, చెరువును పరిశీలించారు. తర్వాత మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట, సిరిపూర్ గ్రామాలకు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. మల్లాపూర్ మోడల్ స్కూల్ రోడ్డు, పెద్ద చెరువు, దుర్గమ్మ చెరువును పరిశీలించి, ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలు భయపడవద్దని భరోసా ఇచ్చారు.
– జగిత్యాల, జూలై 14(నమస్తే తెలంగాణ)
జనంలో ఒకడిగా మమేకమై..
ఎమ్మెల్యే సుంకె అనునిత్యం పర్యవేక్షణ
జనంలో ఒకడిగా తిరుగుతూ వారి వెన్నంటే ఉంటున్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. వర్షం వల్ల ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లినా తక్షణమే అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు. ప్రతి రోజూ అధికారులతో సమీక్షలు నిర్వహించి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ పరిస్థితిని వరుసగా రెండు రోజులు సందర్శించారు. వరద తాకిడి విపరీతంగా ఉండడం.. కట్ట తెగిపోతే నారాయణపూర్కు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉన్నదని గ్రహించి కట్ట కుడి వైపు గండి కొట్టించి వరదను బయటికి పంపించారు. గురువారం వరద ప్రభావిత గ్రామాలైన నారాయణపూర్ శివారులోని ఇస్తారిపల్లిని కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి సందర్శించారు. ఇక్కడి ఎస్సీ కాలనీని ఖాళీ చేయించి గంగాధరలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయించి, అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. ఇటు రామడుగు మండలంలోని పలు గ్రామాల్లోనూ పర్యటించి చెరువులు, కుంటలు, కల్వర్టుల పరిస్థితిని కలెక్టర్కు ప్రత్యక్షంగా చూపించారు. చొప్పదండి మండల కేంద్రంలోని శనగకుంట పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అనంతరం చొప్పదండిలోని తన క్యాంపు కార్యాలయంలో తిరిగి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మల్యాల మండలంలోని రామన్నపేట గ్రామంలో బుధవారం వరద కాలువ పరిస్థితిని పరిశీలించారు. వరద నీరు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో గండి పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొడిమ్యాల మండలంలోని తుర్క కాశీనగర్లో వర్షం కారణంగా కూలిపోయిన ఇండ్లను పరిశీలించి, బాధితులకు ధైర్యం చెప్పారు.
– కరీంనగర్, జూలై 14(నమస్తే తెలంగాణ)
ఒక్కొక్కరినీ స్వయంగా రక్షిస్తూ..
ప్రజలతో మమేకమవుతున్న కోరుకంటి చందర్
వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం సహాయంతో ఒక్కొక్కరినీ స్వయంగా రక్షిస్తూ భరోసా కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో అంతర్గాం మండలంలోని పలు గ్రామాలు, రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని సప్తగిరికాలనీ, గంగానగర్లోని 120 ఇండల్లోకి వరద నీరు చేరగా, ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని స్వయంగా ఒక్కొక్కరిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి నది ఇంటెక్ వెల్ వద్ద ఆరుగురు సింగరేణి కార్మికులు, ఒక బోట్ డ్రైవర్ చిక్కుకోగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చందర్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్తో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించారు. బోట్పై స్వయంగా తాను వెళ్లి వారిని సురక్షితంగా తీసుకువచ్చారు.
– పెద్దపల్లి, జూలై 14(నమస్తే తెలంగాణ)
వర్షాన్ని లెక్కచేయకుండా..
బాధితులు రక్షణగా నిలుస్తున్న ఎమ్మెల్యే దాసరి
వరద బాధితులను ఆదుకోవడంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అత్యంత చొరవ చూపుతున్నారు. వారం రోజులుగా కురిసిన వర్షాలకు పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లోకి వరద చేరగా వెంటనే వారిని దగ్గరుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్దపల్లి కొత్త కలెక్టరేట్ సమీపంలోని రంగంపల్లి వద్ద చెరువు ఉప్పొంగి ప్రవహించడంతో నలుగురు కుటుంబ సభ్యులు చిక్కుకోగా వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వారిని గజ ఈతగాళ్లతో సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. వరద తాకిడికి రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపైకి వరద వచ్చి పెద్దపల్లి కరీంనగర్ మద్య రాకపోకలు నిలిచిపోగా ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని ట్రాఫిక్కు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టారు.
– పెద్దపల్లి, జూలై 14(నమస్తే తెలంగాణ)
అనుక్షణం అందుబాటులో..
క్షేత్రస్థాయిలో మంత్రి గంగుల
కరీంనగర్ నియోజకవర్గంలో వరద బాధితుల ఇబ్బందులు తీర్చడంలో మంత్రి గంగుల కమలాకర్ నిమగ్నమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీనే నగరపాలక అధికారులతో సమీక్షించి అప్రమత్తం చేశారు. ఈనెల 11న కలెక్టరేట్లో జిల్లా, మున్సిపల్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. కంట్రోల్ రూం, హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేయించడంతో పాటు అధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. ప్రతీ గంటగంటకూ వర్షాల తీరుపై సమాచారం తెలుసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ప్రత్యేకంగా 15 మంది సభ్యులతో మూడు రెస్క్యూ టీంలను సిద్ధం చేశారు. బుధవారం నగరంలోని కిసాన్నగర్, అలకాపురి, కృష్ణానగర్, తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనునిత్యం అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. నగునూర్ వాగుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదతో చిక్కుకుపోయిన 9 మంది ఇటుక బట్టీ కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో సురక్షితంగా తీసుకువచ్చి పునరావాస కేంద్రాలకు తరలించారు. నగర శివారులోని వల్లంపహాడ్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కొత్త నీటిని ఫిల్టర్ చేసి టెస్టులు చేసిన తర్వాతే సరఫరా చేయాలని సూచించారు.
– కరీంనగర్ కార్పొరేషన్, జూలై 14
రాత్రింబవళ్లు పరిశీలిస్తూ..
బాధితులకు అండగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
వరద ప్రాంతాలను రాత్రింబవళ్లు పరిశీలిస్తూ బాధితులకు అండగా ఉంటున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్. మంగళవారం రాయికల్ మండలం బోర్నపెల్లి సమీపంలో ఉన్న కుర్రు వద్దకు వెళ్లి కౌలు రైతులు సురక్షితంగా గ్రామానికి వచ్చే వరకు ఎమ్మెల్యే అక్కడే మకాం వేశారు. స్థానిక అధికారులతో పాటు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సైతం మార్గదర్శనం చేశారు. విలేకరి గల్లంతైన విషయం తెలుసుకుని మంగళవారం రాత్రి 12 గంటల వరకు భూపతిపూర్ వాగువద్ద సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాత్రి ఒంటి గంటకు అతని కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ప్రమాదకరంగా ఉన్న జగిత్యాల మండలం కండ్లపెల్లి చెరువు కట్టను బుధవారం ఉదయమే పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. తర్వాత పట్టణంలో ఇల్లు కూలిపోయిన బాధితుడు ఈరవేని గంగన్నను కలిసి ఓదార్చి, సాయం అందజేశారు. 11 గంటల ప్రాంతంలో భూపతిపూర్ వాగు వద్దకు వెళ్లి విలేకరి ఆచూకీ కోసం మరోసారి సహాయ చర్యలను పరిశీలించారు. సాయంత్రం జగిత్యాల పట్టణంలోని పలు వీధుల్లో పర్యటిస్తూ, నష్టాన్ని అంచనా వేయడంతో పాటు చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు వివరించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మంత్రి కొప్పులతో కలిసి భూపతిపూర్కు వెళ్లి మరోసారి పరిస్థితిని సమీక్షించారు. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో భూపతిపూర్కు వెళ్లి వాగులో కనిపించిన కారును వెలికితీసే చర్యల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే, తర్వాత బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు.
– జగిత్యాల, జూలై 14(నమస్తే తెలంగాణ)