కరీంనగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు రైతన్నకు అన్ని విధాలా అండగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సాగునీటి గోసను తీర్చింది. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్నది. ఇంకా ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నది. ఫలితంగా వరి సాగు గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో ధాన్యం దిగుబడి పెరిగింది. కానీ, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కొన్నాళ్లుగా కొర్రీలు పెడుతున్నది. ఇతర రాష్ర్టాల్లో కొంటూ తెలంగాణపై మాత్రం వివక్ష చూపుతున్నది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మంత్రులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నది. ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా.. అక్కడి కేంద్ర మంత్రులను కలుస్తున్నా.. కనీసం స్పందన లేదు. ధాన్యం కొనుగోలుపై కొర్రీలు పెడుతున్న కేంద్రం మెడలు వంచేందుకు టీఆర్ఎస్ సర్కారు సిద్ధమైంది. మోదీ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, డీసీసీబీలు, డీసీఎంఎస్ పాలక మండళ్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపడంతోపాటు ఆ తర్వాత గ్రామగ్రామానా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అన్నదాతల గోడు ఢీల్లీకి అర్థమయ్యేలా ఊరూరా నిరసనలు తెలుపనున్నారు. ఈ ఉద్యమంలో రాష్ట్రంలోని ప్రతి రైతునూ భాగస్వామ్యం చేయాలని, ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు ఎగురవేసేలా సమాయత్త పరచాలని సీఎం పిలుపునివ్వగా, ఆ మేరకు జాగృతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అందులో భాగంగా నేడు నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా నేడు ఉదయం 10గంటలకు నిర్వహించే పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ముఖ్యనాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనే వరకు ఉద్యమిద్దామన్నారు. బుధవారం విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రకటనలు విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ సమావేశాలకు నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులు, సింగిల్విండో, మా ర్కెట్ కమిటీల అధ్యక్షులు, కార్యవ ర్గ సభ్యులు, టీఆర్ఎస్ గ్రామశాఖ, దా ని అనుబంధ సం ఘాల నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.