ఉద్యమ పార్టీగా రాష్ర్టాన్ని సాధించి, ప్రాంతీయ పార్టీగా అస్తిత్వాన్ని నిలబెట్టి, రాజకీయ పార్టీగా ప్రగతిని పరుగులెత్తించిన టీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితిగా అవతరించడంపై నయాజోష్ కనిపిస్తున్నది. దేశ గతిని మార్చే ప్రబల శక్తిగా సరికొత్తగా ఆవిర్భవించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతుండగా శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. శుక్రవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిర్భావ వేడుక నిర్వహించగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభిమానులు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. రోడ్లపైకి చేరి పటాకులు కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. ఇది దేశ ప్రజలకు శుభవార్త అంటూ మనస్ఫూర్తిగా స్వాగతించారు. ‘జై కేసీఆర్.. జయహో బీఆర్ఎస్’ అంటూ నినదించారు.
దసరా శుభముహూర్తాన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ప్రకటించి, రాష్ట్ర రాజకీయ చరిత్రలో నయా అధ్యాయం లిఖించారు. తాజాగా టీఆర్ఎస్ పేరును అధికారికంగా బీఆర్ఎస్గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించగా, శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. దీంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండగా, ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ను స్వాగతించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబురాల్లో మునిగితేలుతున్నారు. దేశంలో సరికొత్త మార్పునకు అడుగుపడిందని, కేసీఆర్ పేద, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో కొత్త వెలుగు తెస్తారని చెబుతున్నారు. నాడు తెలంగాణ కోసం పార్టీని స్థాపించి అలుపెరగని పోరు సల్పి స్వరాష్ర్టాన్ని సాధించారని, ఇప్పుడు అదే స్పూర్తితో ఉజ్వల భారత్ కోసం అడుగువేశారని కొనియాడుతున్నారు. ఆయన అనుకున్నది సాధించేదాక విశ్రమించరని, అందుకు రాష్ట్రమే ఒక ఉదాహరణగా చెబుతున్నారు. దేశానికి తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమాన్ని అందించే సంకల్పంతో బీఆర్ఎస్ అవతరించిందని వివరించారు. కేసీఆర్ వెంటే ఉంటామని, బీఆర్ఎస్తో నడుస్తామని స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే సుంకె ఆదేశాల మేరకు పటాకు లు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. రామడుగు మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కలిసి పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. గంగాధర మండల మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య ఆధ్వర్యంలో నాయకులు పటాకలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి, సంబురాలు చేసుకున్నారు.
ప్రాంతీయ పార్టీగా రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో అద్భుత ప్రగతి సాధించిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా ఆవిర్భవించడంపై ఉమ్మడి జిల్లాలో సంబురాలు హోరెత్తాయి. ప్రజాప్రతినిధులు, నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పేరు మార్పునకు ఈసీ నుంచి గ్నీన్ సిగ్నల్ రావడం, శుక్రవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ఆవిర్భావ వేడుక నిర్వహించడంతో ఎక్కడికక్కడ రోడ్లపైకి చేరి సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి ‘జై బీఆర్ఎస్.. జయహో బీఆర్ఎస్’ అంటూ నినదించారు.
బియ్యం గింజపై ‘జై బీఆర్ఎస్’
బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని మెట్పల్లి మండలం బండలింగాపూర్కు చెందిన స్వర్ణకారుడు ముప్పిడి సురేశ్ వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నారు. బియ్యం గింజలపై బంగారంతో ‘జై BRS’, ‘JAI BRS’ అక్షరాకృతిలో రాసి ఆశ్చర్యపరిచారు. బండలింగాపూర్ను మండలకేంద్రంగా ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ వీటిని రూపొందించినట్లు సురేశ్ తెలిపారు.
– మెట్పల్లి రూరల్, డిసెంబర్ 9
తెలంగాణ మోడల్తోనే దేశానికి మేలు
కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. సబ్బండ వర్గాలను ఏకం చేసి, అన్ని పక్షాల మద్దతును కూడగట్టారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలంగాణను సాధించారు. ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయి విప్లవాత్మక పథకాలను ప్రారంభించారు. పాలనా సంస్కరణలు చేపట్టి అన్ని రాష్ర్టాలకు దారి చూపారు. ప్రస్తుతం దేశంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. ఇలాంటి తరుణంలో తెలంగాణ మోడల్తోనే దేశానికి మేలు కలుగుతుంది.
– కొంక వేణు, సివిక్స్ లెక్చరర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (సారంగాపూర్)
దేశ రాజకీయాల్లో విజయం సాధిస్తారు
కేసీఆర్ నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. తర్వాత యావత్ దేశమే తెలంగాణ వైపు చూసేలా సుపరిపాలన అందిస్తున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో వెళ్లి దేశాన్ని ముందుకు నడిపించాలని అనుకుంటున్నారు. దేశాన్ని మార్చే శక్తి సీఎం కేసీఆర్కు మాత్రమే ఉన్నది. ఇది చరిత్ర చెప్పే సత్యం. భారతదేశంలోని రాజకీయ నాయకులు, మేధావులు ఎంతో మంది సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుంటారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అని ప్రజలు సైతం బలంగా విశ్వసిస్తున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం శుభ పరిణామం. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో సైతం విజయం సాధిస్తారు.
– తగరం శంకర్లాల్, బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు (మంథని)
దేశానికి కేసీఆర్ విజన్ అవసరం
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నేత. ఆయన ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలతో స్టేట్ క్యాపిటల్ అయిన హైదరాబాద్కు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయి. వరల్డ్లో ఫేమస్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. ఐటీ రంగం అభివృద్ధి చెందింది. మారుమూల ప్రాంతాలకు చెందిన ఎందరో విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్ దేశానికి ప్రధాని అయితే ఇండియా కూడా డెవలప్ అయ్యే అవకాశముంటుంది. పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. బీఆర్ఎస్కు దేశంలో మంచి ఆదరణ లభిస్తుంది.
– ఉదయ్వర్ధన్రెడ్డి, సాఫ్ట్వేర్ ఉద్యోగి (రాజన్న సిరిసిల్ల)
బీఆర్ఎస్తో ఉజ్వల భవిత
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితితో దేశానికి ఉజ్వల భవిష్యత్ లభిస్తుంది. ఆయన కొత్తగా ఏర్పాటైన రాష్ర్టాన్ని అన్నింటా ముందునిలిపారు. పేద, మధ్య తరగతి వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించారు. రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలతో అన్నదాతకు అండగా నిలిచారు. నాడు ఉద్యమ పంథాలో రాష్ర్టాన్ని సాధించిన ఆయన ఇప్పుడు దేశ ప్రజల గతిని ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. ఆయన నాయకత్వంలో దేశ ప్రజల జీవితాల్లో పెనుమార్పులు రానున్నాయి. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కేసీఆర్ సారును ఆశీర్వదించి అండగా నిలువాలి.
-బొద్దుల లక్ష్మణ్, జూలపల్లి జడ్పీటీసీ, కేసీఆర్ సేవా దళం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
మన పథకాలు కావాలని కోరుకుంటున్నారు
మోదీ పాలనలో దేశం అధోగతి పాలైంది. కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించడంతో ప్రభుత్వరంగం నిర్వీర్యమైంది. నిరుద్యోగ నిర్మూలన, రైతు సమస్యల పరిష్కారంలో విఫలమైంది. కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలకు విసుగొచ్చింది. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో శూన్యత కనిపిస్తున్నది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా మారనున్నది. మన తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన పథకాలు దేశమంతటా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– ముత్యాల బలరాంరెడ్డి, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్
ప్రధాని అయ్యే అర్హత కేసీఆర్కు ఉన్నది
తెలంగాణకు చెందిన పీవీ నర్సింహారావు ప్రధానిగా దేశఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఇదే తరహాలో ఉద్యమ పంథాతో ముందుకెళ్లి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందునిలిపారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిగా మార్చారు. పాలనాలోనూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయనకు ప్రధాని అయ్యే అర్హతలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఏర్పాటుతో ఇది సాధ్యమవుతుంది.
-తుమ్మ రాజ్కుమార్, యువసంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు (సుల్తానాబాద్)
మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం..
ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఆయన ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికి మోడల్గా నిలిపారు. ముందుచూపుతో పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు బడ్జెట్లో 10 శాతం హరిత నిధిని కేటాయించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో తాగు, సాగునీటి సమస్యలను దూరం చేశారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో అన్నదాతకు అండగా నిలిచారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో ఆడబిడ్డలు ఉన్న నిరుపేద తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. ఇలాంటి తరుణంలో ఆయన బీఆర్ఎస్ను స్థాపించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.
– తిరునగరి రమణ, ప్రేరణ సోషల్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు (కోరుట్ల)
సరికొత్త అధ్యాయం
బీఆర్ఎస్ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతున్నది. 21 ఏండ్ల క్రితం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్కు తెలంగాణ జనం జై కొట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రజారంజక పాలన అందించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పేదల బతుకుల్లో వెలుగులు నింపారు. ఇప్పుడు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. బంగారు భారత్ నిర్మాణానికి బాటలు వేస్తున్నారు.
– హరి అశోక్ కుమార్, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
ఆనందంగా ఉంది
బీఆర్ఎస్కు ఎన్నికల కమిషన్ గుర్తింపు దక్కడం ఆనందంగా ఉన్నది. కేసీఆర్ పోరాట పటిమతో రాష్ర్టాన్ని సాధించారు. అనతికాలంలోనే తెలంగాణను అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిపారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో అడగుపెట్టారు. భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకోనున్నది.
– వేముల సుధాకర్రెడ్డి, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
పార్టీకి ఆదరణ లభిస్తుంది..
సీఎం కేసీఆర్ రాజకీయ చతురత కలవాడు. పోరాట పటిమతో తెలంగాణను సాధించారు. సీఎంగా అనేక సంస్కరణలు చేపట్టి ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇప్పుడు దేశం నాయకత్వలేమితో సతమతమవుతున్నది. కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ వైఖరితో ప్రజానీకం ఇబ్బందుల పాలవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్కు ప్రజల ఆదరణ లభించనున్నది. ఆయన నాయకత్వంలోనే దేశ ప్రజలకు మేలు జరుగుతుంది.
-ప్రతాప సంతోష్, న్యాయవాది (వేములవాడ)
దేశ రాజకీయాల్లో సత్తా చాటుతుంది..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపర చాణక్యుడు. దీక్షా దక్షత కలిగిన నేత. ఆయన నేతృత్వంలో టీఆర్ఎస్ రెండుసార్లు అఖండ విజయాన్ని సాధించింది. అధికారం చేపట్టి వినూత్న సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజల మన్ననలు అందుకున్నది. ఇప్పుడు కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ దేశ రాజకీయాల్తో సత్తా చాటుతుంది. ప్రజల బీజేపీని ఢీకొట్టే సత్తా ఉన్న పార్టీగా నిలబడుతుంది.
– గుడిసె సుదర్శన్. న్యాయవాది
దేశం దశ దిశ మార్చడం ఖాయం
ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా రూపుదిద్దుకున్నది. స్వరాష్ట్రంలో అధికారం చేపట్టి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన ఎనిమిదేండ్లలో అనేక విజయాలు సాధించింది. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపింది. ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా అస్తవ్యస్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అవతరించింది. దేశంలో జలవనరుల వినియోగం, రైతులకు నాణ్యమైన కరెంట్ను అందించడం, నిరుద్యోగ నిర్మూలన లాంటి ఆదర్శాలతో ముందుకు వస్తున్న బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ సారథ్యంలో మన దేశ దశ దిశను మార్చడం ఖాయం.
-కేతిరెడ్డి రఘోత్తం రెడ్డి, ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమ నేత (మంథని)