సిటీబ్యూరో: హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై హైకోర్టు జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం చేసిన దరిమిలా.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హైడ్రా రంగనాథ్ను తొలగించాలంటూ గత మూడురోజులుగా నగర ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, హైడ్రా బుల్డోజర్ ఆక్రమణలు వదిలేసి హక్కుదారులపై పడడం చాలా అన్యాయమని వివిధ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోయిన భాగ్యనగరం రెండేళ్లుగా ఆ రంగంలో చతికిలపడిపోయింది. దేశ రియల్ రంగ చిత్రపటంలో హైదరాబాద్కు చోటు దక్కకపోవడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో దూసుకుపోయిన రియల్ రంగానికి ఇది పెద్ద దెబ్బగానే చెప్పాలి.
హైడ్రా ఏర్పాటైన తొలి మూడునెలల కూల్చివేతలలో కొన్ని తప్పులు జరిగాయంటూ చాలా సందర్భాల్లో రంగనాథ్ స్వయంగా చెప్పారు. మరి ఈ తప్పుకు బాధ్యులెవరన్న దానికి మాత్రం సమాధానం లేదు. చాలా చోట్ల బస్తీవాసులు, మధ్య తరగతి ఇండ్లు కూల్చివేతల సందర్భాల్లో నియంతృత్వ ధోరణితో కనీసం వారికి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామునే వచ్చి కట్టుబట్టలతో బయటకు పంపి కూల్చివేతలు చేపట్టిన ఘటనలు నగర జీవి స్మృతిపథంలో చెరగరానివిగా హైడ్రా వ్యవహరించింది. తాజాగా హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కమిషనర్ తీరుపై చర్చ జరగడం గమనార్హం.