ఉప్పల్, జూలై 29 : హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాన్ని బట్ట బయలు చేశాయని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విమర్శించారు.ఇళ్లను కూల్చివేసే విషయంలో అధికారాలు వినియోగించిన హైడ్రా చట్టం ముందు విఫలమైంన్నారు. హైడ్రా పేరుతో పేదలు, మధ్య తరగతి ఇళ్లపై బుల్డోజర్లు నడిపించి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన ప్రభుత్వం, ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలతో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఒకరికీ ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం అనే విధంగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ మొదటి నుంచి హైడ్రా చర్యలు చట్ట పరిరక్షణ కోసం కాకుండా రాజకీయ కక్ష సాధింపునకు ఉపయోగపడుతున్నాయని హెచ్చరిస్తూ వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే రంగనాథ్ను పదవీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు ధిక్కరణ కింద అనేక కేసులు నమోదు అయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా అహంకారపూరిత వైఖరిని విడనాడి హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కోరారు.