సిరిసిల్ల టౌన్, జనవరి 18: బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మహర్దశ పట్టిందని టీపీటీడీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ స్పష్టం చేశారు. ఎనిమిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో నేతన్న అభ్యున్నతికి అనేక పథకాలు తెచ్చిన ఘనత కేటీఆర్కే దక్కిందని కొనియాడారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేతినిండా పనికల్పిం చే లక్ష్యంతో బతుకమ్మ చీరెలు, ప్రభుత్వ వస్ర్తాల ఆర్డర్లు ఇప్పించారని గుర్తు చేశారు. కేసీఆర్ సర్కారు పాలనలోనే నేత కార్మికులు నిశ్చింతగా జీవితాలు సాగించారని చెప్పారు.
ఇప్పుడు చేనేత, పవర్లూం కు తేడా తెలియని వారు కూడా బీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. నాడు ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా తప్పించుకున్నదని దుయ్యబట్టా రు. అప్పుడు సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు ఒక్క మీటరు బట్ట కూడా ఆర్డర్ ఇవ్వలేదని, ఆప్కో బకాయిల చెల్లింపులో జాప్యం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే రీతిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ల క్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.
నిజంగా కార్మికులపై ప్రేమ ఉంటే బతుకమ్మ చీరెల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, గత ప్రభుత్వ హయాంలో కంటే నాలుగింతల వస్ర్తాల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు ఓట్ల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపాదనలు ఇస్తే మెగా పవర్ లూం క్లస్టర్ తెస్తానంటూ ఎంపీ బండి సంజయ్ చెబుతున్నాడని.. కానీ, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్కుమార్ అనేకసార్లు కేంద్ర జౌళిశాఖ మంత్రికి వినతిపత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు.
గత ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని వెంటనే సిరిసిల్లకు మెగా పవర్లూం క్లస్టర్ మంజూ రు చేయించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో నేతన్నల కోసం వర్కర్ టూ ఓనర్ స్కీంలో భాగంగా 46షెడ్లు వీవింగ్ పార్కుతో పాటు 4కామన్ ఫెసిలిటీ కోసం ప్రారంభించిన షెడ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు రాంచంద్రం పాల్గొన్నారు.