ప్రగతి ప్రదాత, యువసారథి రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మొదట జగిత్యాలలో 325 కోట్ల పనులకు, ధర్మపురిలో 248 కోట్లతో పూర్తి చేసిన పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. జగిత్యాలలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, నూకపెల్లి వద్ద కేసీఆర్ కాలనీలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జగిత్యాల మినీస్టేడియంలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొని, ధర్మపురికి వెళ్లనున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, 247.86 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాల పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వేదిక నుంచే వెల్గటూర్ మండలంలో అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఆ తర్వాత సిరిసిల్ల జిల్లాకేంద్రానికి వెళ్లనున్నారు. సమీకృత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరై, 561 మంది ఎస్సీ లబ్ధిదారులకు 24.50 కోట్ల రాయితీ రుణాలకు సంబంధించి జంబోచెక్ అందిస్తారు. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసి, మండెపల్లిలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తారు.
జగిత్యాల, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ)/ ధర్మపురి : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మొదట జగిత్యాల, ధర్మపురిలో పర్యటించి, 573 కోట్లతో నిర్మించిన పలు నిర్మాణాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముందుగా ఆయన జగిత్యాలకు రానున్నారు. ఉదయం 9.45గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ఉన్న హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఆ తర్వాత 20 ఎకరాల విస్తీర్ణంలో 40 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, నూకపెల్లి వద్ద 280 కోట్లతో నిర్మించిన 4,520 డబుల్ బెడ్రూం ఇండ్ల కేసీఆర్ కాలనీని, మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్ను ప్రారంభిస్తారు.
11.30 గంటల జగిత్యాల మినీస్టేడియంలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొని, ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకొని, ధర్మపురికి బయలుదేరుతారు. ఒంటి గంటకు ధర్మపురిలో కేడీసీసీ బ్యాంకు ఎదుట ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. తర్వాత 8.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ప్రారంభిస్తారు. 247.86 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాల పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం 1.30గంటలకు ధర్మపురి జూనియర్ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగిస్తారు. అనంతరం గృహలక్ష్మి పథకం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు జంబో ప్రొసీడింగ్ కాపీని అందజేస్తారు.
వేదిక నుంచే వెల్గటూర్ మండలంలో నూతనంగా నిర్మించే అగ్రికల్చర్ డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. 3గంటలకు బహిరంగ సభను ముగించుకొని, హెలీక్యాప్టర్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు బయలుదేరుతారు. మంత్రి పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ కోసం డయాస్ను, కుర్చీలను, టెంట్లను సిద్ధం చేశారు. అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట పూలు, కుండీలతోపాటు లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చౌరస్తాలను గులాబీమయంగా మార్చారు. రోడ్ల వెంట ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు ఫ్లెక్సీలు పెట్టారు. స్థానిక నాయకులతో కలిసి మంత్రి పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరు సంజయ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ భాస్కర్ బందోబస్తు చర్యలను పరిశీలించారు. అటు ధర్మపురిలోనూ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుండగా, రాత్రి సమయంలో మంత్రి కొప్పుల ఏర్పాట్లను పరిశీలించారు.