రైల్వే ట్రాక్ పనుల్లో మునిగిపోయిన కూలీలపైకి రాజధాని ఎక్స్ప్రెస్ వాయువేగంతో దూసుకొచ్చింది. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలను తీసుకెళ్లింది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను చూసి ఆ కుటుంబాలు రోదించిన తీరు కలిచివేసింది. పెద్దపల్లి జిల్లా చీకురాయి-కొత్తపల్లి గ్రామాల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో రైల్వే ఉద్యోగి, ఇద్దరు దినసరి కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఒకరు పదోన్నతి లభించిన పదిరోజులకే ప్రాణాలొదలగా, కూలీకి వచ్చిన మొదటి రోజే మరొకరికి చివరిరోజు కావడం కన్నీరు తెప్పించింది.
పెద్దపల్లి, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి రూరల్: రోజూ వారీ విధుల్లో భాగంగా తమ పనిలో నిమగ్నమైన ముగ్గురు కార్మికులు ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా చీకురాయిలో మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే, స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా చీకురాయి-కొత్తపల్లి గ్రామాల మధ్యలోనే రైల్వే ట్రాక్పై ఒక రైల్వే ఉద్యోగి, మరో ముగ్గురు రోజు వారి కూలీలు మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. రైల్వే గ్యాంగ్మెన్ కత్తుల దుర్గయ్యతోపాటు పెద్ద కల్వల గ్రామానికి చెందిన పెగడ శ్రీనివాస్, ఎలిగేడు మండలం నర్సాపూర్కు చెందిన కాంపెల్లి వేణు, ఊదరి శ్రీనివాస్ అనే ముగ్గురు దినసరి కూలీలు రైల్వే ట్రాక్లకు గ్రీసులు పూస్తూ తమ పనిలో నిమగ్నమయ్యారు. పక్క ట్రాక్ నుంచి గూడ్స్ రైలు వెళ్తుండగా ఆ శబ్ధంతో పని చేస్తున్న ట్రాక్పై నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ రాకను గమనించిన ఊదరి శ్రీనివాస్ అరుచుకుంటూ పక్కకు జరిగారు. మిగతావారు పక్కకు తప్పుకునేలోపే వాయువేగంతో వచ్చిన రాజధాని ఎక్స్ప్రెస్ దుర్గయ్య, పెగడ శ్రీనివాస్, కాంపెల్లి వేణును బలంగా ఢీకొట్టింది. దీంతో రెప్పపాటులో వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురి మృతదేహాలు చెల్లా చెదరుగా పడిపోయాయి. మృతుల్లో దుర్గయ్యకు ఒక కూతురు, భార్య ఉండగా, పెగడ శ్రీనివాస్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు, భార్య, కాంపెల్లి వేణుకు ఒక పాప, ఒక బాబు, భార్య ఉన్నారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల రైల్వే జీఆర్పీ ఎస్ఐ సుధాకర్, రామగుండం జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ తిరుపతి, పోలీసులు చేరుకొని వివరాలు సేకరించడంతో పాటు మృతదేహాలను మార్చురీకి తరలించారు.
నాడు గాయపర్చిన రాజధానే నేడు దుర్గయ్య ప్రాణం తీసింది..
రైల్వే శాఖలో రైల్వే గ్యాంగ్మెన్గా విధులు నిర్వహిస్తున్న కత్తుల దుర్గయ్యది మహబూబ్బాద్ జిల్లా పత్తిపాక. ఉద్యోగరీత్యా రామగుండం రైల్వే క్వార్టర్స్లో ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం రామగుండం రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా రాజధాని ఎక్స్ప్రెస్ కింద పడి ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. తాజాగా అదే రాజాధాని ఎక్స్ప్రెస్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. దుర్గయ్య ఏడాది క్రితమే తన కూతురికి వివాహం చేయగా, ఈ నెల 10వ తేదీన ముగ్దుంగా పదోన్నతి సైతం లభించింది. పదోన్నతి లభించిన పది రోజులకే ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతి వార్తతో రోదనలు మిన్నంటాయి.
కూలీకి వచ్చిన తొలి రోజే చివరి రోజైంది..
ఎలిగేడు మండలం నర్సాపూర్కు చెందిన కాంపెల్లి వేణుకు ఒక చంటి పాప, బాబు, భార్య ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు రూ.550 దినసరి కూలీ కోసం రైల్వే ట్రాక్పై మరమ్మతు పనులకు వచ్చేందుకు మాట్లాడుకొని మంగళవారం తొలి సారిగా పనికి వచ్చాడు. ఇంట్లో కుటుంబ సభ్యులకు పనికి పోయొస్తా అని చెప్పి ఎప్పటికీ కానరాని లోకాలకు వెళ్లి పోయాడు. శ్రీనివాస్ మృతి వార్తతో కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరినీ కంటి తడి పెట్టించింది.
రైలును జూసి ఒక్క గంతేసిన
ప్రమాదం నుంచి బయటపడ్డ కార్మికుడు ఊదరి శ్రీనివాస్
అందరం కలిసి పనులు జేసుకుంటున్నం. పట్టాలకు గ్రీసు పూసుకుంటూ ముందటికి పోతన్నం. అప్పుడే పక్క ట్రాక్ మీన్నించి గూడ్స్ రైలు పోతంది. ఆ సప్పుడు మేము ఇనుకుంటనే పని చేసుకుంటన్నం. అంతల్నే ఒక్కసారి మేం గ్రీసు పూసే ట్రాక్ మీద రైలు కనపడ్డది. అంతే ఒక్క గంతేసిన. చూసే వరకు రైలు పోతంది. నా పక్కకు దుర్గయ్య, శ్రీను, ఇయాల అచ్చినైన (కాంపెల్లి వేణు) చెల్లా చెదురుగా పడ్డరు. మస్తు భయమైంది. రెండు రైళ్ల నడమ నేనొక్కన్నే ఉన్న. అంతల్నే గూడ్స్ పోయింది. చూసే వరకు ముగ్గురు ముక్కలు ముక్కలై పడున్నరు. రైలు పోయినంక దూరంగా ఉరికి పోయిన.