ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేటాయించిన ధాన్యం మేరకు తిరిగి అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23కు సంబంధించిన సీఎంఆర్ను గత డిసెంబర్ 31లోపే అప్పగించాల్సి ఉన్నా.. యాభై శాతం కూడా లక్ష్యం చేరుకోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నెల 31వరకు గడువు పొడిగించినా.. ఆలోగా లక్ష్యం పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. సీఎంఆర్ కింద ఇంకా 9.06 లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉన్నది.
ఇంత పెద్ద మొత్తంలో బియ్యాన్ని అప్పగించడం ఏ పరిస్థితుల్లో సాధ్యం కాదని గత పరిస్థితులు స్పష్టం చేస్తుండగా, ఇప్పటికే కోట్ల విలువైన ధాన్యాన్ని పలువురు మిల్లర్లు అమ్ముకున్నట్లు ఇటీవలి తనిఖీల్లో బహిర్గతమైంది. ఈ పరిస్థితుల్లో మరోసారి గడువు పొడిగించకుండా.. లక్ష్యాన్ని పూర్తి చేయని మిల్లర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.
కరీంనగర్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం పండించిన రైతుకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొంటున్నది. సదరు ధాన్యాన్ని పైసా పెట్టుబడి లేకుండా కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పేరిట మిల్లర్లకు అందిస్తున్నది. క్వింటాల్ ధాన్యానికి ఇంచుమించు గా 67 కిలోల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 2022-23 వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని మిల్లులకు ప్రభుత్వం సీఎంఆర్ కింద మొత్తం 25,19,652 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. అందుకు గాను 16,96,836 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ)కు అప్పగించాల్సి ఉన్నది.
కానీ, రెండు సీజన్లలో కలిపి ఇప్పటివరకు 7,90,498 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. అంటే లక్ష్యంలో కేవలం 46 శాతం మాత్రమే మిల్లర్లు అప్పగించారు. అధికారుల గణాంకాల ప్రకారం చూస్తే.. 9,06,338 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించాలి ఉన్నది. నిజానికి సీఎంఆర్ కింద గతంలో మూడు సార్లు గడువు పొడిగించి.. చివరకు గత డిసెంబర్ 31లోగా పూర్తి చేయడానికి అవకాశమిచ్చింది. అయినా మిల్లర్ల నుంచి అంతంత మాత్రమే స్పందన వచ్చినట్టుగా కనిపిస్తున్నది.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పలు హెచ్చరికలు చేసినా.. సీఎంఆర్ వేగం పెరిగినట్లుగా పెద్దగా కనిపించడం లేదు. కాగా, మరికొంత సమయం ఇచ్చైనా ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల 31వరకు గడువు ఇచ్చింది. ఈ లెక్కన ఇంకా 25రోజుల గడువు ఉన్నది. ఈ గడువులోగా మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యం మేరకు బియ్యం ఇస్తారా..? అంటే అసాధ్యమే అని చెప్పాలి. ఆరు నెలల నుంచి ఏడాది పాటు టైం ఇచ్చినా పలువురు మిల్లర్లు వారికి కేటాయించిన ధాన్యం మేరకు బియ్యం ఇవ్వడం లేదు. నిజానికి ఉమ్మడి జిల్లాలో కొంత మంది మిల్లర్లు 2021-22 సీజన్కు సంబంధించిన సీఎంఆర్ కూడా ఇప్పటికీ పూర్తి చేయలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో 2022-23కు సంబంధించి లక్ష్యం పూర్తి చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తున్నది. కానీ, తిరిగి బియ్యం ఇవ్వడంలో మాయాజాలం కనిపిస్తున్న ది. అయితే మిల్లర్లు వివిధ కారణాలు చెప్పడం, తద్వా రా ప్రభుత్వాలు సీఎంఆర్ గడువు పొడిగించడం జరుగుతున్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది అక్రమాలకు తెరలేపినట్లుగా ఇటీవల మిల్లులపై జరిగిన దాడులే బహిర్గతం చేస్తున్నాయి. జమ్మికుంట, జగిత్యా ల, హుజూరాబాద్, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో విజెల్స్తోపాటు పౌరసరఫరాల అధికారుల తనిఖీల్లో విస్తుపోయేలా అక్రమాలు వెలుగుచూశాయి.
కోట్ల విలువ చేసే ధాన్యం సదరు మిల్లుల్లో కనిపించకుండా పోయిం ది. ఆరా తీస్తే.. సదరు ధాన్యాన్ని కొంత మంది ఇతర ప్రాంతాల్లో నేరుగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటే.. మరికొంత మంది బియ్యం చేసి విక్రయించుకున్నట్టుగా తనిఖీల్లో బయటపడింది. కాగా, కొంత మంది మాత్రం నిజాయితీగా వారికి కేటాయించిన ధాన్యాన్ని సంబంధించిన బియ్యం ఇస్తుంటే.. మరికొంత మంది మాత్రం ధాన్యం విక్రయించి సొమ్ము చేసుకున్నారనే విమర్శలు ప్రస్తుతం మిల్లర్లలోనే వినిపిస్తున్నాయి.
సీఎంఆర్కు సంబంధించి ఈ నెల 31 వరకు గడువిచ్చిన సర్కారు, ఆ లోగా లక్ష్యం పూర్తి చేయని మిల్లర్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికే ఈ విషయంలో సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చాయని ఓ అధికారి తెలిపారు. ముందుగా సంబంధిత మిల్లర్లతో మాట్లాడి లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటారు. గడువులోగా ఇవ్వకుంటే వారి పూర్తి వివరాలు సేకరించి.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆడుగులు వేస్తున్నది.
ఈ విషయంలో ఒక్క పౌరసఫరాల శాఖకు మాత్రమే బాధ్యతలు అప్పగించకుండా.. నేరుగా కలెక్టర్లను రంగంలోకి దింపేందుకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లుగా అధికారవర్గాల ద్వారా సమాచారం అందుతున్నది. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్లు మాత్రం.. ప్రభుత్వంపై ఏదో ఒక మార్గంలో ఒత్తిడి తెచ్చి ఈ గడువును మార్చి 31వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టినట్టుగా తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో మిల్లర్ల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతుందా..? లేక నిబంధనల ప్రకారం రావాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించని వారిపై చట్టపరమైనా చర్యలు తీసుకుటుందా..? చూడాల్సిన అవసరమున్నది.