Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ (రాజారఘువంశీ హత్య) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీ బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. అంతేకాదు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ కేసు విచారణ ఆలస్యమైతే ఆరు నెలల తర్వాత కొత్తగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. గతేడాది వివాహ తర్వాత రాజా రఘువంశీ, అతడి భార్య సోనమ్ రఘువంశీ మేఘాలయలోని షిల్లాంగ్కు హనీమూన్కు వెళ్లారు.
మే 21, 2025న హనీమూన్కు వెళ్లగా, అదే నెల 26న ఇద్దరూ కనిపించకుండా పోయారు. జూన్ 2న ఒక లోయవద్ద రాజా రఘువంశీ మృతదేహం లభించింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరపగా.. భార్య సోనమ్ రఘువంశీయే హత్య చేయించినట్లు తేలింది. ఆకాష్ సింగ్ రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మి అనే ముగ్గురు రాజాను హత్య చేశారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో పలువురికి బెయిల్ లభించింది. అందులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీకి ఈ ఏడాది ఏప్రిల్ 28న బెయిల్ లభించింది.
షిల్లాంగ్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయగా, ప్రస్తుతం ఆమె బెయిల్పై బయటే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ బెయిల్ను సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పీబీ వరాలే ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు సోనమ్కు ఇటీవల రెండు ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి తనకుతానుగా లొంగిపోవడం, రెండోది కోర్టు బెయిల్ రద్దు చేయడం. ఈ ఆదేశాలపై సోనమ్ తరఫు లాయర్ల వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సోనమ్ తనకుతానుగా లొంగిపోయిందని చార్జ్షీట్లో ఉందని ప్రభుత్వం తరఫు లాయర్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.
ఒకవేళ ఇంకా బెయిల్ కొనసాగితే సోనమ్ కనిపించకుండా పోయే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ సోనమ్ బెయిల్ రద్దు చేసింది. మూడువారాల్లోగా విచారణ అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. దర్యాప్తు ఆరు నెలల్లో పూర్తి కాకపోతే తిరిగి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.