మంథని, సెప్టెంబర్ 21: యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసిందంతా అవినీతి, అక్రమాలేనని, వాళ్లు మళ్లీ అధికారంలోకి వచ్చినా చేసేది అదేనని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. నాడు సీఎం వైఎస్సార్ మంథని నియోజకవర్గంలోని కాటా రం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని, అది అవినీతికి కేరాఫ్గా మారిందని విమర్శించారు. ఒక్క మంథని నియోజకవర్గంలోనే 61,200 ఇండ్లను కట్టినట్లుగా చూపారని, ఆనాడు అన్ని ఇండ్లు నిర్మించి ఉంటే ఈ రోజు ఇంత మందికి సొంత ఇండ్లు లేకుండా ఎలా ఉన్నారని, ఆ ఇండ్లు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభివృద్ధి అంతా కాగితాల పైనే తప్పా స్థానికంగా ఉండదని దుయ్యబట్టారు. మంథని ఎస్ఎల్బీ గార్డెన్స్లో డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలకు చెందిన గృహాలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసిడింగ్ కాపీలను మంత్రి కొప్పుల ఈశ్వర్ జడ్పీ చైర్మన్లు పుట్ట మధూకర్, జక్కు శ్రీహర్షిణీ, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, ఆదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడారు. నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం, ప్రాంతంపై అభిమానం కలిగిన పుట్ట మధూకర్ను ఎమ్మెల్యే గెలిపించుకొని మనమే కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఒకటి.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒకరు ఉంటే అభివృద్ధి జరగదన్నారు. మంథని నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించే సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్కు జడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించారన్నారు. పుట్ట మధూకర్ చొరవతో నియోజకవర్గానికి వందల కోట్ల నిధులతో 50 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కానీ అభివృద్ధిని ఈ తొమ్మిదిన్నరేండ్లలో చేపట్టారన్నారు. 60 ఏండ్ల తర్వాత బొక్కలవాగుపై 6 కోట్లతో బ్రిడ్జిని నిర్మించుకుంటున్నామంటే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకులు ఎలాంటి పాలనను అందించారో గుర్తు తెచ్చుకోవాలన్నారు.
పుట్ట మధూకర్ జడ్పీ చైర్మన్ కాక పోతే మంథని నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగేదా అని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని, జిల్లాలో 250 కోట్ల ఖర్చుతో 25వేల ఇండ్లను మంజూరు చేశామన్నారు. మంథని నియోజకవర్గంలో మొత్తం 3000 ఇండ్లను మంజూరు చేయగా, మంథని డివిజన్కు 1500, కొత్తగా ఏర్పడబోయే కాటారం డివిజన్కు 1500 ఇండ్లను కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మంథని ఆర్డీవో హనుమానాయక్, మంథని, కమాన్పూర్, ముత్తారం ఎంపీపీలు కొండ శంకర్, లక్ష్మి, జక్కుల ముత్త య్య, జడ్పీటీసీలు తగరం సుమలత శంకర్లాల్, మ్యాదరవేన శారద, చెల్కల స్వర్ణలత అశోక్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు ఎగోలపు శంకర్గౌడ్, దాసరి రాయలింగు, కిషన్రెడ్డి, వీకే రవి, శ్రీపతి బానయ్య, యాకుబ్ ఉన్నారు.
నాది ఓటు బంధం కాదు, ఈ నియోజకవర్గ ప్రజలతో పేగు బంధం. రక్త సంబం ధం. పేదింటి బిడ్డనైన నాకు మంథని నియోజకవర్గ ప్రజలు ఒక్క సారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించారు. నా ఇద్దరు పిల్లల పెండ్లిళ్లు చేశా. మంథనిలోనే ఇల్లు కట్టుకున్నా. ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించక పోయినా, నియోజకవర్గ అభివృద్ధి ఆగి పోవద్దని సీఎం కేసీఆర్ నాకు జడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నా. ఇక నా పనులన్నీ పూర్తయ్యాయి. ప్రభుత్వం గొప్ప సంకల్పంతో తీసుకువచ్చిన గృహాలక్ష్మి పథకం కింద నియోజకవర్గంలోని ఇల్లు లేని పేదలందరికీ ముందు నిలబడి ఇండ్లు కట్టిస్తా.
సొంత బాధ్యతగా తీసుకుంటున్నా. ఇప్పటికే నియోజకవర్గానికి 3వేల ఇండ్లు మంజూరయ్యాయి. మరో వెయ్యి ఇండ్లు మంజూరు కోసం త్వరలోనే సీఎం కేసీఆర్ను కలిసి సాధిస్తా. ఆయన ఆశీర్వాదంతో ఇండ్లను తీసుకువచ్చి కట్టిస్తా. మరో రెండ్రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై నా సొంత ఎజెండాను ప్రకటిస్తా. ఏ ఉన్నత చదువుల కోసమైతే పేద తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్లో చదివించేందుకు ఇబ్బంది పడుతున్నారో వాళ్లందరిరి కోసం నా సొంత ఖర్చులతో హైదరాబాద్లో హాస్టల్ను ఉచితంగా అందుబాటులో తీసుకువస్తా. మీ పిల్లలకు చదువులకు సాయం చేస్తా.
– పుట్ట మధూకర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్,
జిల్లాలో గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక, ప్రొసీడింగ్స్ పంపిణీ ప్రక్రియ నెలలోగా పూర్తి చేస్తాం. జిల్లాలో 25వేల మందితో లిస్టు సిద్ధం చేసి పెట్టుకున్నాం. 8వేలకు మందికి పైగా పంపిణీ చేసి రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా ముందు వరుసలో ఉంది. అన్ని పథకాల్లో పెద్దపల్లి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలతో ముందు వరుసలో నిలుస్తున్నది. గృహాలక్ష్మి లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు.
– ముజామ్మిల్ఖాన్, కలెక్టర్
ఇల్లు లేని ఏ ఇంటి మహాలక్ష్మి ఆవేదన చెందవద్దనే సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని తీసుకు వచ్చారు. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కేసీఆర్ సంకల్పం. మంథనిలో జిల్లాలోని డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచాం. గృహలక్ష్మి లబ్ధిదారులందరూ సొంత ఇళ్లను కట్టుకునే విధంగా ప్రోత్సహిస్తాం. మున్సిపల్ పాలకవర్గం, సిబ్బంది సహాయ సహకారాలతో గృహలక్ష్మిని విజయవంతం చేస్తాం.
– పుట్ట శైలజ, మంథని మున్సిపల్ చైర్ పర్సన్