ఎక్కడో గుట్టల్లో నివాసాలు. ఉన్నవి కేవలం 12 కుటుంబాలు. నివసించేది 32 మంది. గొర్రెలు, మేకల పెంపకం, వ్యవసాయమే ఆధారంగా వైవిధ్యమైన జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ తండా కథ ఇది..
ధర్మారం జనవరి 20 : ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూక్యా సంగ్యా నాయక్, భూక్యా రంజిత్నాయక్ అనే ఇద్దరు అన్నదమ్ములు సుమారు వందేండ్ల క్రితం మేకలను మేపుకొంటూ వచ్చి ధర్మారం మండలం నర్సింగాపూర్కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టల్లో స్థిరపడ్డారు.
మొదట గుడిసెలు వేసుకొని ఉండేవారు. మొదట గొర్రెల పెంపకమే వీరి జీవనాధారం. క్రమంగా 12 కుటుంబాలు ఏర్పడగా 32 మంది నివసిస్తున్నారు. కాగా, ప్రస్తుతం వ్యవసాయంవైపు మళ్లారు. సంగ్యానాయక్కు ఐదుగురు బిడ్డలు జన్మించగా వారికి పెండ్లిళ్లు చేశాడు. అతడి తమ్ముడు రంజిత్ నాయక్కు నలుగురు కొడుకులు జగ్యా నాయక్, పర్షా నాయక్, భీమ్లా నాయక్, దేల్యా నాయక్ ఉన్నారు.
తదనంతర కాలంలో సంగ్యానాయక్, రంజిత్ నాయక్ భార్యభర్తలు మరణించారు. కాగా, రంజిత్ నాయక్ పెద్ద కొడుకు జగ్యా నాయక్కు ఒక కొడుకు, రెండో కొడుకు పర్షానాయక్కు ముగ్గురు కొడుకులు, 3వ కొడుకు భీమ్లా నాయక్కు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, చిన్న కొడుకు దేల్యా నాయక్కు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు. రంజిత్ నాయక్ నలుగురు కొడుకుల్లో ముగ్గురు వృద్ధ్యాప్యంతో మరణించగా ఇప్పుడు మూడో కొడుకైన భీమ్లా నాయక్ (75) జీవించి ఉన్నాడు.
ప్రస్తుతం ఈ తండాలో 10 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. చుట్టూ గుట్టలు, చిత్తడి ప్రదేశంలో రేకుల షెడ్లల్లో ఉంటున్నారు. కాగా, నర్సింగాపూర్ సమీపంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్న భోగందాని గుట్ట బోరు ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మించుకోవాలని భావిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఈ భూమిని చదును చేయించారు. 12 ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతున్నారు.
మా పూర్వీకులు ఆదిలాబాద్ నుంచి గొర్రెలు మేపుకొంటూ వచ్చి ఇక్కడి గుట్టమధ్య స్థిరపడ్డారు. గొర్రెలు పెంచుకుంటూ, ఎవుసం చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నం. మా నలుగురు అన్నదమ్ములకు పెండ్లిండ్లు అయ్యాయి. సంతానం పెరిగింది. ఇన్నేండ్లు కష్టానష్టాలను ఓర్చుకుంటూ ఇక్కడే ఉంటున్నం. అయితే మా పిల్లలు బడికి వెళ్లడం, రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నం. ఇప్పుడు మా ఊరు దగ్గరలో ఇండ్లు కట్టుకోవాలని అనుకుంటున్న. గవర్నమెంట్ మాకు ప్రభుత్వ భూమి ఇప్పించి ఇండ్లు కట్టియ్యాలి.
– భూక్యా భీమ్లా నాయక్, లంబాడి తండా వాసి (నర్సింగాపూర్)