హుజూరాబాద్, జూలై 23: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని, ఇది ముమ్మాటికీ వందశాతం జరిగి తీరుతుందని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ అర్చక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ శంఖారావానికి హాజరై, మాట్లాడారు. అయ్యగార్లు చాలా గొప్ప మనుషులని, గుడికి ఎంత గొప్పవారు, పేదవారు, మధ్యతరగతి వాళ్లు వచ్చినా వాళ్ల కుటుంబం మంచిగుండాలని కోరుకుంటారని, ఈ సందర్భంగా వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాక ముందు ఈ ప్రాంతాన్ని, దేశాన్ని 60 నుంచి 65 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు బ్రాహ్మణులకు చేసింది శూన్యమని, కానీ సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలోనే 60ఏండ్ల ప్రగతి చేసి చూపారని, బ్రాహ్మణులకు అండగా నిలిచారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 35వేల గుడులు ఉంటే ఆనాడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ధూపదీప నైవేద్యాలకు కేవలం రూ.2500 నుంచి రూ.3వేలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ 12,500 గుడులు ఉంటే కేసీఆర్ రూ.6వేలు ఇచ్చారని, దానిని రూ.10 వేలకు పెంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
12,500 గుళ్లకు రూ.10వేలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరేనని చెప్పక తప్పదన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణులు ఏండ్లుగా కోరినా ఎవరూ పట్టించుకోలేదని, కానీ సీఎం కేసీఆర్ 2017లో రూ.300 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. గుడులు, బ్రహ్మణుల గురించి సీఎం కేసీఆర్ ఆలోచించినంతగా దేశంలో మరెవరూ ఆలోచన చేయలేరని, దీనికి తార్కణమే యాదిరిగుట్ట పునర్నిర్మాణమని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని తిరుపతి తరహాలో తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. మీ ఆశీర్వాదాలు ఉంటే నియోజకవర్గంలోని ఇల్లందకుంట రామాలయం, వీణవంకలోని వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు ఓ మోస్తరు పేరున్న ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దుతానన్నారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేములవాడ, కొండగట్టు, భద్రాచలం టెంపుల్ను అద్భుతంగా తీర్చిదిద్దుతారని, ఇది రాసి పెట్టుకోండని స్పష్టం చేశారు. 121జీవో సమస్యతోపాటు ఇతర విన్నపాలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, తెలంగాణ అర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు వల్లూరి పవన్కుమార్, అర్చక సంఘం రాష్ట్ర జేఏసీ కన్వీనర్ రవీంద్రాచార్యులు, అర్చక సంఘం ఉద్యోగ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖరశర్మ, బ్రాహ్మణసేవాసమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విష్ణుదాసు గోపాల్రావు, నాయకులు పీవీ ప్రభాకర్ రావు, సంపత్రావు తదితరులున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా బ్రాహ్మణులకు అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ వర్తింపజేశారు. సీఎం బ్రాహ్మణ పక్షపాతి. కేసీఆర్ను గత సెప్టెంబర్ 17న ప్రగతి భవన్లో కలువగా జీవో 57 ద్వారా 5625 దేవాలయాల్లోని అర్చక ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు చెల్లించేలా ఆదేశాలు ఇచ్చారు. ఈ జీవో ద్వారా 3వేల మంది అర్చకులు జీతభత్యాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని 16 లక్షల మంది బ్రాహ్మణులకు సరైన గుర్తింపు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. అలాంటి ఆయనకు బ్రాహ్మణులు అందరూ అండగా ఉండాలి.
-గంగు ఉపేంద్ర శర్మ, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షుడు
రాష్ట్రంలోని యావత్ బ్రాహ్మణులకు ఎంతో ఆత్మీయంగా ఉండి ఆదుకుంటున్న బీఆర్ఎస్ను, ముఖ్యమంత్రి కేసీఆర్కు బ్రాహ్మణులంతా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పాటు చేసి 17 పథకాలను బ్రాహ్మణులకు వర్తింపజేసిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుంది. ధూపదీప నైవేద్య పథకం కింద రూ .10వేలు ఇస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
– నాగరాజు మహేంద్రాచార్యులు, ధూపదీప నైవేద్యం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు