నెర్రెలు బారిన నేలలు, నోళ్లు తెరిచిన బావులు, అడుగంటిన భూగర్భ జలాలు, అడుగడుగునా కరువు.
మెట్టప్రాంతంలో జలసవ్వడులు, పెరిగిన భూగర్భజలాలు, చేతికందేలా బావుల్లో నీళ్లు, పచ్చని పంటలు.
ఇది తొమ్మిదేండ్లలో మారిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖచిత్రం. సీఎం కేసీఆర్ జల సంకల్పం, మంత్రి కేటీఆర్ చొరవతో అనతికాలంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా పచ్చని మాగాణానికి కేరాఫ్గా మారిపోయింది. ప్రాజెక్టుల నీళ్లు పంటపొలాలకు చేరడంతో ఏకంగా 309 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. గతంతో పోలిస్తే ఎకరాకు దిగుబడి 10 క్వింటాళ్లు పెరిగి.. అన్నదాతల బతుకుల్లో ఆనందం నింపింది. నాడు కరువుతో కొట్టుమిట్టాడిన సిరిసిల్ల నేడు సాగునీటి రంగంలో ఐఏఎస్లకే ఒక జల పాఠ్యాంశంగా మారింది.
– కరీంనగర్, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
అరవై ఏండ్ల గోస తీరింది
నాకు అరవై ఐదేండ్లుంటయ్. మాది నర్మాల. పూర్తిగా మాది మెట్టప్రాతం. పుట్టినప్పటి సంది ఎప్పుడూ నీటికి గోసవడుడె మాకు తెలుసు. ఇప్పటి వరకు ఏసంగి పంటలు వేసింది ఏళ్ల మీద లెక్కేయచ్చు. ఒకవేళ ఏసినా లాగోడు మునిగోటోళ్లం. కానీ, కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినంక రైతుల అరవై ఏండ్ల గోస తీర్చిండు. ఇప్పుడు నిరందిగా పంటలు పండిస్తున్నం. అవ్వతోడు చెబుతున్నా సర్.. నేను పుట్టినప్పటి సంది ఎగువ మానేరు ప్రాజెక్టుకు ఇట్ల నీళ్లిచ్చుడు ఇదే తొలుత. మా తల మీదనే మానేరు ఉన్నా ఎప్పుడు ఎండిపోవుడేనాయె. ఇప్పుడు ఎండకాలంలో మానేరు మత్తడి దుంకుతున్నది. నాకు ఎగువమానేరు ప్రాజెక్టు కింద మూడు ఎకరాల పొలం ఉంది. ఎప్పుడు వానల మీద ఆధారపడేటోన్ని. కానీ, నాలుగైదేండ్లుగా కేసీఆర్ సార్ దయ వల్ల ఏసంగి పంటలు పండిస్తున్న. ఎన్కట నీళ్లు లేక మానేరు ప్రాజెక్టు శివారులోని పొలాలు బీళ్లుగా ఉంటుండె.
బాయిలు తవ్వినా నీళ్లు పడలె. కరెంటు కూడా సక్కగా లేకుండె. అన్ని కట్టాలె ఉండె. వానల కోసం మొగులు దిక్కు జూసెటోళ్లం. వాన పడితేనే వరి నాటేసేటోళ్లం. పంటలు చేతికొచ్చేదాకా బుగులే ఉండె. కానీ, కేసీఆర్ మా గోసను తీర్చిండు. పెట్టుబడికి పైసలు ఇచ్చుడే గాకుండా, ఏనాడు సక్కగా నిండని మానేరును ఎండకాలంలో నింపుతుండు. ఇప్పుడు మాకు బుగులు పోయింది. ధైర్నంగా రెండు పంటలు పండిత్తున్నం. యాడ జూసినా నీళ్లే కనిపిస్తున్నయ్. కాలువల్లో నిండుగా పారుతున్నయ్. ఆ నీళ్లను చూస్తే కడుపు నిండుతంది. కేసీఆర్ సారు దయవల్ల ఇయాళ సంతోషంగున్నం. యాడాదిలో రెండు పంటలు తీస్తున్నం. సీఎంనే గాదు, మా మంత్రి కేటీఆర్ సారును జీవితాంతం గుర్తు పెట్టుకుంటం. పట్టువట్టి ఇక్కడికి నీళ్లను రప్పించిండు. ఇంత సౌలత్ జేత్తడని కలలో కూడా అనుకోలె.
-ఆకునూరి రాజయ్య, రైతు,నర్మాల(గంభీరావుపేట మండలం)