ఒకప్పుడు కరీంనగర్ మంచినీటి సమస్యతో అల్లాడేది. పక్కనే మానేరు రిజర్వాయర్ ఉన్నా.. వేసవి వచ్చిందంటే చాలు తండ్లాడేది. కానీ, నాటి కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో కరీం‘నగర’ం దాహం తీరింది. అర్బన్ భగీరథ కింద వివిధ పనులు పూర్తి చేయడంతో రెండేండ్లుగా నగర ప్రజలకు ప్రతిరోజూ మంచినీరు సరఫరా అవుతున్నది. శివారు కాలనీలకు కూడా నీరు చేరుతున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 1 : అర్బన్ మిషన్ భగీరథ కింద కరీంనగర్లో 125 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ ) వద్ద నుంచి రా వాటర్ సరఫరా చేశారు. అందుకు ఫిల్టర్ బెడ్స్, శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని గుట్టపై 3 ఎంఎల్డీ కెపాసిటీ ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. దీంతోపాటు రాంనగర్, హౌసింగ్బోర్డుకాలనీలో రెండు రిజర్వాయర్లను ఏర్పా టు చేశారు. ఎల్ఎండీ వద్ద ఫిల్టర్ బెడ్ నుంచి పద్మనగర్ బైపాస్ రోడ్డును ఆనుకొని శాతవాహన యూనివర్సిటీలోని గుట్ట వరకు నీటి పంపింగ్ కోసం నూతనంగా పైపులైన్లు వేశారు.
అక్కడి నుంచి 1.4 కిలో మీటర్ల ఉన్న మల్కాపూర్ రోడ్డు రిజర్వాయర్కు, అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంనగర్ రిజర్వాయర్ అటు నుంచి కిలో మీటర్ దూరంలో ఉన్న కోర్టు చౌరస్తాలోని రిజర్వాయర్ను నింపేందుకు కొత్త పైపులైన్లు ఏర్పాటు చేశారు. నూతనంగా 36 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్ కూడా నిర్మించారు. దీంతో నగరంలో ఎక్కడా మంచినీటి సరఫరాకు ఇబ్బందులు తొలిగిపోగా, నిత్యం తాగునీరు అందిస్తున్నారు.
నగరపాలక సంస్థలో విలీనమైన ఎనిమిది గ్రామాలకు కూడా ప్రతి రోజు మంచినీటి సరఫరాకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 25 కోట్లతో పైపులైన్ వేస్తున్నది. వీటిల్లో ఇప్పటికే అత్యధిక శాతం పనులు పూర్తికాగా, మిగిలిన పనులను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయనున్నారు. వచ్చే వేసవి నాటికి ఈ విలీన గ్రామాల్లోనూ రోజూ మంచినీటి సరఫరా అందించేందుకు చర్య లు చేపడుతున్నారు.
నగరంలో పైలెట్ ప్రాజెక్టు కింద హౌసింగ్బోర్డు రిజర్వాయర్ పరిధిలో 24 గంటల మంచినీటి సరఫరాకు సంబంధించి పనులు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటికే రిజర్వాయర్ నుంచి వివిధ ప్రాంతాలకు మంచినీటి సరఫరా అందించేందుకు హెచ్డీ పైపుైల్లెను వేశారు. ఆయా ప్రాంతాల్లో మీటర్లను కూడా ఏర్పాటు చేసి వాటి పనితీరును పరిశీలిస్తున్నారు. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి ఈ రిజర్వాయర్ పరిధిలో 24 గంటల మంచినీటి సరఫరాకు ప్రయత్నిస్తున్నారు.