జమ్మికుంట, ఏప్రిల్ 9 : మనిషి బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణాల్లో వైకుంఠధామాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 50 వేలకు పైగా జనాభా ఉన్న జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ పాలకవర్గం వసతుల్లేని, శ్మశాన వాటికలు లేని స్థానాల్లో వైకుంఠధామాలు నిర్మించేందుకు గత సంవత్సరం ప్రతిపాదనలు చేసింది. మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం, కొత్తపల్లి, ఆబాది, కేశవాపూర్, ధర్మారం, రామన్నపల్లి, తదితర వార్డుల్లో ఆధునిక వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టారు. జనాభాకనుగుణంగా ఆబాది, కేశవాపూర్, ధర్మారం, రామన్నపల్లి వార్డుల్లో రూ.50 లక్షలతో శ్మశానాలను ఆధునీకరించారు. ఇక మోత్కులగూడెం, కొత్తపల్లి ఒక్కో మోడల్ వైకుంఠధామానికి రెండెకరాల స్థలం కేటాయించారు. మోత్కులగూడెం వైకుంఠధామాన్ని రూ.కోటి 27లక్షలతో పూర్తి చేయగా, అందుబాటులోకి వచ్చింది. కొత్తపల్లి వైకుంఠధామాన్ని రూ.కోటి 30లక్షలతో చేపట్టగా, పనులు చివరి దశకు చేరుకున్నాయి.
ఆధ్యాత్మికం.. ఆహ్లాదం
జమ్మికుంట వైకుంఠధామంలో ఎటు చూసినా పచ్చని చెట్లు.. విరగబూసిన పూల వనాలు ఉన్నాయి. ఆధ్యాత్మికత కోసం భవనాలు, ప్రత్యేక స్నానాల గదులు. కూర్చునేందుకు బేంచీలు. లోనికి అడుగుపెట్టగానే.. దండంపెట్టి పూజ చేయాలనిపించే లయాకారుడు శివుడి భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. చుట్టూ తిరిగేలా వాకింగ్ ట్రాక్, దారి పొడవునా.. గ్రీనరీ, 24 గంటల కరెంట్, స్నానాలు, తాగేందుకు నీటి సౌకర్యం కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదైనా దేవాలయంలో అడుగుపెట్టామా..? పెద్ద పార్కుకు వచ్చామా..? అనిపించేలా ఆహ్లాదకరమైన వాతావరణం తలపించేలా తీర్చిదిద్దారు.
అభివృద్ధికి పెద్దపీట
గతంలో పట్టణంలో శ్మశానాల్లేక ఇబ్బందులు పడేవాళ్లం. అంతిమ సంస్కారం కోసం సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ గొప్ప గౌరవం కల్పించిన్రు. రూ.కోట్లు వెచ్చించి వైకుంఠధామాలకు శ్రీకారం చుట్టినం. మున్సిపల్ పరిధిలో పలు చోట్ల ఏర్పాటు చేసినం. కొత్తపల్లి, మోత్కులగూడెంలో మోడల్ వైకుంఠధామాలను నిర్మించినం. అంతే కాకుండా, జమ్మికుంట పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం.
– తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, మున్సిపల్ చైర్మన్, జమ్మికుంట
ఎన్నో ఇబ్బందులు పడ్డాం
శ్మశానాల్లేక.. ఉన్నకాడ సౌలతుల్లేక ఎన్కట ఎన్నో ఇబ్బందులు పడ్డం. శ్మశానాలంటే భయపడేటోళ్లం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక వైకుంఠధామాలు నిర్మించిన్రు. సకల సౌకర్యాలు కల్పించిన్రు. పార్కులల్ల తిరిగినట్లున్నది. గుళ్లకు పోయినట్లున్నది. సచ్చినోళ్లతోటి పోతే బాధలు మరిసిపోతం. అన్ని సౌలతులతో వైకుంఠధామాలు నిర్మించిన బీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటం.
– పొనగంటి సంపత్, పీఏసీఎస్ చైర్మన్