ఎన్నో ఏళ్లుగా రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వీఆర్ఏలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. గత ప్రభుత్వాలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమను పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేశారని వీఆర్ఏలు పేర్కొన్నారు.
తమను ఏశాఖకు కేటాయించినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఉద్యోగ క్రమబద్ధీకరణతో తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని వీఆర్ఏలు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.