జగిత్యాల రూరల్, మే 27: జగిత్యాల జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి సీఎం కప్ 2023 పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని నిలబెట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన జగిత్యాల జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికైన 160 మంది క్రీడాకారులు ఆదివారం హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు శనివారం ఐదు బస్సుల్లో బయల్దేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, కలెక్టర్ యాస్మిన్బాషాతో కలిసి జెండా ఊపి బస్సులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్లో రాష్ట్రస్థాయి సీఎం కప్ 2023 క్రీడా పోటీల్లో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ తదితర క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాను ముందంజలో నిలపాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష, వ్యక్తిగత అంశాల్లో విజేతలైన వారికి రూ.25వేలను అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, మండల, నియోజక వర్గ, జిల్లాస్థాయిల్లో రాణించిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలని అభిలషించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్, ఎస్పీ భాసర్ పాల్గొన్నారు.