సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వారం పది రోజులుగా స్థిరత్వం లేకుండా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు వెయ్యిపైనే పెరిగి మునుపెన్నడూ లేని విధంగా సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. సన్న బియ్యం డిమాండ్కు తగినట్లు ధాన్యం ఉత్పత్తి లేకపోవడం, ఉమ్మడి జిల్లాలో పండిన కొద్ది పాటి సన్నరకం వడ్లను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళ్లడంతో స్థానికంగా బియ్యానికి కొరత ఏర్పడినట్లు తెలుస్తున్నది.
దీంతో మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతున్నది. ధరలు విపరీతంగా పెరగడంతో అమ్మకాలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతుండగా, ఇదే అదునుగా కొందరు మిల్లర్లు, ట్రేడర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్న సన్న బియ్యాన్ని బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
– కరీంనగర్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : సన్న బియ్యం ధరలు పెరుగుతున్న కొద్దీ సామాన్యుల్లో దడ పుడుతున్నది. ఉమ్మడి జిల్లాలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తున్నారు. దొడ్డు రకం వడ్లకు ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుండడంతో రైతులు శ్రమ లేకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకుంటున్నారు. దీంతో ఎక్కువ మంది రైతులు సన్న రకం వడ్లపై దృష్టి పెట్టడం లేదు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తుండడంతో ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తున్నది.
అయితే, కేసీఆర్ ప్రభుత్వం సన్నరకాల సాగును ప్రోత్సహించినా ఎక్కువ మంది రైతులు దొడ్డు రకాలకే మొగ్గు చూపుతూ వచ్చారు. అయితే, డిమాండ్కు తగినట్లు సన్న రకా ల ఉత్పత్తి లేక పోవడం, గత వానకాలంలో వచ్చిన తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో వరి భారీగా దెబ్బతినడంతో అక్కడి వ్యాపారులు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పండిన సన్నాలు, దొడ్డు రకం వడ్లను ఎక్కువ శాతం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు కూడా ఇక్కడి సన్నాలకు భారీ ధర చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో సన్న వడ్లు స్థానిక అవసరాలకు కొరతగా మారాయి. దీంతో సన్న బియ్యానికి ధరలు అమాంతం పెరిగాయి.
సన్న బియ్యం ధరలు మునుపెన్నడూ లేని విధంగా సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. వారం కింద ఉన్న ధర ఇప్పుడు లేదు. పైగా రోజుకో విధంగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొన్నది. మార్కెట్లో ప్రధానంగా జైశ్రీరాం, హెచ్ఎంటీ, బీపీటీ సన్న రకం బియ్యానికి మంచి డిమాండ్ ఉంటుంది. వారం కింద జైశ్రీరాం మంచి రకం బియ్యం క్వింటాలు ధర 6,400 ఉంటే ఇప్పుడు 7,200 ఆపైన పెరిగింది. అంటే దీనిపై ధర 800 పెరిగింది. వారం కింద హెచ్ఎంటీ మంచి రకం ధర క్వింటాలుకు 6 వేలు ఉంటే ఇప్పుడు దీని ధర 6,400 పలుకుతున్నది. దీనిపై 400 పెరిగింది.
అదే బీపీటీ బియ్యం వారం కింద క్వింటాలుకు 4,800 ఉండగా ఇప్పుడు 5,600 పలుకుతున్నది. అంటే దీనిపై కూడా 800 పెరిగింది. వారం కింది నుంచే ఈ పరిస్థితి కనిపిస్తున్నది. ఏడాది కింద కాస్త స్థిరంగా ఉన్న ధరలు వారం నుంచి విపరీతంగా పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతున్నది. ఏడాది కింద జైశ్రీరాం బియ్యం క్వింటాలుకు 6,400, హెచ్ఎంటీ 4,800, బీపీటీ 5,600గా వారం పది రోజుల వరకు స్థిరంగా ఉన్నాయి. ఒక్కసారిగా బియ్యం ధరలు ఈ విధంగా ఆకాశాన్ని అంటుతుండడంతో ఏం కొనాలో, ఏం తినాలో అర్ధంకాని అయోమయ స్థితిలో సామాన్యులు పడుతున్నారు.
నేను 18 ఏండ్లుగా బియ్యం వ్యాపారం చేస్తున్న. ఈ సారి సన్న బియ్యం ధరలు చాలా పెరిగినయి. వారంలో ఇంత భారీగా ధరలు పెరగడం ఇదే మొదటిసారి చూస్తున్న. ఉమ్మడి జిల్లాకు నిజామాబాద్, మిర్యాలగూడ, తదితర ప్రాంతాల నుంచి సన్నాలు తెప్పించుకుంటం. ట్రాన్స్పోర్ట్ చార్జీలే భారంగా మారుతున్నయి. ఇప్పుడు ధరలు పెరగడం మరింత భారమవుతున్నది. ఒక్కో కస్టమర్కు చెప్పలేక పోతున్నం. ఇంత ధర పెట్టి కొనలేమని చాలా మంది మొఖం మీదనే అంటున్నరు. వారం పది రోజులుగా అమ్మకాలు పడిపోయినయి. జిల్లాలో సన్న రకం వడ్లు ఎక్కువగా సాగు చేయకపోవడం, అవసరానికి తగినట్లు సన్న రకాల వడ్లు అందుబాటులో లేక పోవడంతో బియ్యం ధరలపై ఎఫెక్ట్ పడుతున్నది. ఇంత అస్థిరమైన ధరలు మాత్రం నెనెప్పుడూ చూడ లేదు. ఒకసారి పెరిగిందంటే ఏడాది వరకు అవే ధరలు ఉండే వి. కానీ, ఇప్పుడు రోజు రోజుకూ మారుతున్నయి.. ఇదే ఆందోళన కలిగిస్తంది.
– ఎన్ గంగారం, బియ్యం వ్యాపారి (కరీంనగర్)
సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కొందరు మిల్లర్లు, ట్రేడర్లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో వచ్చిన సన్న రకం వడ్ల దిగుబడిని ఇతర రాష్ర్టాల వ్యాపారులు తీసుకెళ్తుండగా.. మన జిల్లా వ్యాపారులు మాత్రం ఎక్కువగా నిజామాబాద్, మిర్యాలగూడ జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మిల్లర్లు కొందరు సన్న బియ్యం మరాడించి విక్రయించే వారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. స్థానికంగా కేవలం 30 శాతం మాత్రమే సన్న బియ్యం మార్కెట్కు వస్తున్నది. ఈ నేపథ్యంలో కొందరు ట్రేడర్లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కొన్ని మిల్లుల్లో సాంబమసూరిలో వివిధ రకాల వడ్లను మరాడించినప్పుడు వచ్చే బియ్యం క్వాలిటీని బట్టి జైశ్రీరాం, బీపీటీ, హెచ్ఎంటీ రకాలుగా మార్చుకుంటున్నట్లు తెలుస్తున్నది. కొందరు వ్యాపారులు కూడా కవర్లు మార్చుతూ క్వాలిటీ తక్కువ ఉన్న బియ్యాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా బియ్యంపై జీఎస్టీ విధించినప్పటి నుంచి 26 కిలోల బస్తాల్లో బియ్యం విక్రయిస్తున్నారు. అయితే, కొనుగోలు చేసిన చాలా బియ్యం సంచుల్లో 25 కిలోలే ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భారమంతా సామాన్య, మధ్య తరగతి ప్రజలే భరించాల్సి వస్తున్నది.