పెద్దపల్లి, మార్చి 14 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 2024కు గానూ 19 మందికి అవార్డులను ప్రకటించింది. అందులో పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం దక్కింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి తానిపర్తి చికితను క్రీడారంగంలో, జూలపల్లి మండలకేంద్రానికి చెందిన దేవనపల్లి వీణావాణిని సాహిత్య రంగంలో ఎంపిక చేయగా, సర్వత్రా హర్షం వ్యక్తమైంది. రాష్ట్ర మహిళా శిశు, వైకల్య, వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ అవార్డులను పంపిణీ చేయనున్నది.
ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి శ్రీనివాస్రావు- శ్రీలత దంపతుల కూతురు, కొడుకు. రైతు కుటుంబం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కూతురు చికిత, ఎనిమిదేండ్ల వయసులోనే విలు విద్యపై ఆసక్తి పెంచుకున్నది. బిడ్డ ఇష్టాన్ని గమనించి తండ్రి శిక్షణ ఇప్పించడంతో పట్టు సాధించింది. 2017 -18లో క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆ యువతి, గోవాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది. గతేడాది బెంగళూర్లో నిర్వహించిన జాతీయ స్థాయి టోర్నీలో పసిడి పథకంతో ప్రతిభ చాటుకున్నది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జూనియర్, సీనియర్ నేషనల్ గేమ్స్లో బహుమతుల పంట పండించింది. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన చికిత ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్లో ఫథకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.
దేవనపల్లి వీణావాణిది స్వస్థలం జూలపల్లి కాగా, ప్రస్తుతం హైదరాబాద్లో నివాసముంటున్నారు. ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో వృక్షశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2005లో అటవీ శాఖలో ఉద్యోగం సాధించి ప్రస్తుతం అదే శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారిగా పనిచేస్తున్నారు. జోగులాంబ సర్కిల్ ఫ్లయింగ్ స్కాడ్ పార్టీ అధికారిగా, నారాయణపేట జిల్లా అటవీ శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అయితే, తెలుగు సాహిత్యంపై ఉన్న అభిరుచితో రెండు కవితా సంకలనాలు, ఒక పర్యావరణ వ్యాసాలు రాశారు. ఆమె అనేక పురస్కారాలు అందుకున్నారు. 2020లో సంత్రామరాసు సేవావాల్ పురస్కారం, క్యాతం కృష్ణారెడ్డి పురస్కారం, 2021లో తిరుణగరి శ్రీనివాసాచార్య జాతీయ పురస్కారం, 2022లో పీచర సునీతారావు సాహిత్య పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పురస్కారం పొందారు.