చిగురుమామిడి, డిసెంబర్ 10: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలతో గర్భిణులు సర్కారు దవాఖానల్లో పరీక్షలు, ప్రసవాలు చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. యేటేటా కాన్పుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనమని వైద్యాధికారులు చెబుతున్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం వరకు అన్ని టెస్ట్లు ఉచితంగా చేయడంతో పాటు నాణ్యమైన మందులు, కేసీఆర్ కిట్ ఇస్తుండడమే కారణమని పేర్కొంటున్నారు. గ్రామాల్లో ఆశ కార్యకర్తల ద్వారా చేపట్టిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెబుతున్నారు.
సర్కారు దవాఖానల్లో సకల వసతులు కల్పిస్తుండడంతో గర్భిణులు కాన్పు చేయించుకునేందుకు ముందుకువస్తున్నారు. ఈ యేడాది జనవరి నుంచి ఇప్పటివరకు మండలంలో 325 ప్రసవాలు జరగగా ఇందులో 205 ప్రభుత్వ వైద్యశాలలో జరిగాయి. మండలంలోని 17 గ్రామాలకు గాను 8 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, సుందరగిరి, నవాబుపేట, ములనూరు, ముదిమాణిక్యం, ఇందుర్తి గ్రామాల ఆరోగ్య ఉప కేంద్రాలకు గాను వైద్యుడి తో పాటు13 మంది ఏఎన్ఎంలు, 36 మంది ఆశ కార్యకర్తలు ఉన్నారు. మండల ఆరోగ్య కేంద్రానికి వారానికి రెండుసార్లు గర్భిణులను ప్రభుత్వ వాహనంలోనే తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.
గ్రామాల్లో మహిళలు గర్భం దాల్చగానే వారి వివరాలను ఆశ కార్యకర్తలు మాతా శిశు పోర్టల్లో నమోదు చేస్తున్నారు. వారానికి రెండుసార్లు గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం లేదా మండల ఆరోగ్య కేంద్రానికి ప్రభుత్వ వాహనంలో తీసుకెళ్లి రక్త, మూత్ర పరీక్షలు, రక్తహీనత నివారణకు మందులు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడూ వైద్య సిబ్బంది ట్యాబ్లో వివరాలు నిక్షిప్తం చేస్తున్నారు. ఇండ్లకు వెళ్లి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకుంటున్నారు. సుఖ ప్రసవానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్తో సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ స్కీం కింద వారి ఖాతాలో మొదటగా 3 వేలు వేస్తున్నారు. ప్రసవనాంతరం మగ బిడ్డ పుడితే రూ. 12వేలు, ఆడబిడ్డకు రూ. 13వేలు ఇస్తున్నారు. వివిధ రకాల వస్తువులతో కేసీఆర్ కిట్లు అందజేసి ప్రభుత్వ వాహనంలోనే వారిని ఇండ్లకు చేరుస్తున్నారు.
ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నది. ఇందుకు విరివిగా నిధులు వెచ్చిస్తున్నది. అలాగే గర్భిణుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతుంది. వైద్యసిబ్బంది సైతం నాణ్యమైన సేవలందిస్తున్నారు.
-నాగశేఖర్, మండల వైద్యాధికారి, చిగురుమామిడి
ప్రభుత్వ దవాఖానల్లో టెస్ట్లు చేయించుకోవాలని గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం. గర్భం దాల్చిన వెంటనే వారి ఇండ్లకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. ప్రతివారం పరీక్షల కోసం ప్రభుత్వ వాహనంలో ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకుంటే కలిగే మేలును వివరిస్తున్నాం.
-బండారి సరోజన, ఆశ కార్యకర్త, రేకొండ